రఘురామకు ఆర్బీఐ షాక్-సాయిరెడ్డి ఫిర్యాదు-ఇండ్-భారత్ పై చర్యలు తీసుకుంటామని లేఖ
వైసీపీ వర్సెస్ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుగా సాగిపోతున్న పోరులో మరోసారి వైసీపీది పైచేయి అయింది. రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చెందిన ఇండ్-భారత్ ధర్మల్ పవర్ లిమిటెడ్ అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఫలించింది.
రఘురామకృష్ణంరాజుకు చెందిన ఇండ్ భారత్ ధర్మల్ పవర్ లిమిటెడ్ సంస్ధ ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, ఆర్ధిక ఆక్రమాలకు పాల్పడుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జూలై 21న కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదు చేశారు. ఈ లేఖను కేంద్ర ఆర్ధికశాఖ ఆర్భీఐకి పంపింది. దీనిపై విచారణ జరిపిన ఆర్బీఐ.. దీనిపై తీసుకుంటున్న చర్యల్ని వివరిస్తూ సాయిరెడ్డికి సమాధానం పంపింది. అక్టోబర్ 8న సాయిరెడ్డికి ఆర్బీఐ రాసిన ఈ లేఖను వైసీపీ నేతలు తాజాగా విడుదల చేశారు.

జూలై 21న సాయిరెడ్డి రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్నామని, ఇందులో సాయిరెడ్డి ప్రస్తావించిన అంశాల్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఇందులో ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న అంశాలపై చర్యలు తీసుకుంటామని సాయిరెడ్డికి పంపిన లేఖలో ఆర్బీఐ ఛీఫ్ జనరల్ మేనేజర్ జయశ్రీ గోపాలన్ పేర్కొన్నారు. దీంతో ఇండ్-భారత్ సంస్ద అక్రమాలపై ఆర్బీఐ దృష్టిసారించినట్లు అర్ధమవుతోంది.
వైసీపీతో సాగిస్తున్న పోరులో భాగంగా సాయిరెడ్డితో పాటు జగన్ కు వ్యతిరేకంగా రఘురామకృష్ణంరాజు పిటిషన్లు వేస్తున్న క్రమంలో ఆయన దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఇండ్-భారత్ సంస్ధను టార్గెట్ చేశారు. దీనికి సంబంధించి పాత అక్రమాలను తెరపైకి తెస్తూ వైసీపీ నేత సాయిరెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీంతో రఘురామ ఇరుకునపడ్డారు. అయితే గతంలో సాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్లు వేసిన రఘురామ.. ఇఫ్పుడు తెలంగాణ హైకోర్టులోనూ పిటిషన్ వేశారు.
రఘురామకృష్ణరాజుకు సంబంధించిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడంలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి. విజయసాయిరెడ్డి రాసిన లేఖపై.. తగిన చర్యలు తీసుకుంటామంటూ ఆర్ బీఐ లేఖ.












Click it and Unblock the Notifications