వైయస్ జగన్తో రాజీ: విశాఖ నుంచి షర్మిల పోటీ?
షర్మిల భర్త బ్రదర్ అనిల్ విశాఖపట్నంలో నిర్వహించనున్న సువార్త సభలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో షర్మిల విశాఖపట్నం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. డిసెంబర్ 6 నుంచి మూడు రోజుల పాటు ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో అనిల్ సువార్త సభలు జరుగనున్నాయి.
విశాఖపట్నానికి చెందిన రాకుర్తి చక్రధరరావు పర్యవేక్షణలో బ్రదర్ అనిల్ సభలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చక్రధరరావు వైయస్ జగన్కు అత్యంత సన్నిహితుడని, ఉత్తరాంధ్రకు సంబంధించిన రాజకీయ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు జగన్కు నివేదిస్తుంటారని అంటారు. షర్మిలకు కడప నియోజకవర్గాన్ని కేటాయించకపోవడంతో షర్మిల విశాఖ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో షర్మిలకు మద్దతు కూడగట్టడానికే అనిల్ ఈ సభలు నిర్వహిస్తున్నారని అంటున్నారు.
జగన్ జైలు నుంచి విడుదల కాకపోతే ఆయన స్థానంలో ముఖ్యమంత్రి పీఠానికి షర్మిల ముందుకు వచ్చేవారని అంటున్నారు. విజయమ్మ పార్టీ వ్యవహారాలు చూసుకుంటే, షర్మిల అన్నయ్య స్థానంలో ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకునేవారని అంటారు. జగన్ జైలు నుంచి విడుదల కావడంతో షర్మిల కాస్తా వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. కడప సీటు కోసం పట్టుబడుతూ అన్నయ్యపై ఆమె అలిగినట్లు ప్రచారం సాగింది.