సిగ్గుందా, మీ ఇంటివద్దే ఉరేసుకుంటా: బాబు-వెంకయ్యలపై హీరో శివాజీ తీవ్రవ్యాఖ్యలు
హైదరాబాద్: ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నటుడు శివాజీ మంగళవారం నాడు హెచ్చరిక జారీ చేశారు. చంద్రబాబుకు నేను ఓ విషయం చెబుతున్నానని, హోదా విషయంలో ప్యాకేజీలతో సర్దుకుపోవాలని చూస్తే, నేరుగా మీ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానన్నారు.
మీ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకొని చరిత్రలో నిలిచిపోతానని చెప్పారు. మీరు చరిత్రహీనులు అవుతారన్నారు. చరిత్ర సృష్టిస్తారా, చరిత్ర హీనులవుతారా అని ప్రశ్నించారు. తమాషా చేస్తున్నారా, మీరంతా ఏపీ ప్రజలతో ఆడుకుంటారా అని నిలదీశారు.
తెలుగువాడైన వెంకయ్య నాయుడుకి సమాచార శాఖ కూడా ఇచ్చారని, వారి విషపు పడగ ఏం చేస్తుందో భవిష్యత్తులో అంతా చూస్తారన్నారు. భావితరాల ఉసురు తగులుతుంని శాపనార్థాలు పెట్టారు. నాటకాలు ఆడవద్దన్నారు. కేంద్రంలో ఒక్కొక్కరూ ఒక్కొక్క స్టయిల్లో... ఏపీ ఒక్కటేనా? అంటున్నారన్నారు.
ప్రత్యేక హోదాపై పావులు, ఎవరికి షాక్?: 'కాంగ్రెస్' కేవీపీకి బాబు కౌంటర్
సన్నాసుల్లారా... ఏపీని రెండుగా విడగొట్టిన సన్నాసులు మీరు అని ఏ ఒక్కడికీ మాట్లాడే అర్హత లేదని ద్వజమెత్తారు. మీరు మనుషులు కాదా అన్నారు. హోదా అంటే చిన్న చూపు వద్దన్నారు. ఆ రోజు గడ్డితిని హామీలు ఇచ్చారా అని దుయ్యబట్టారు.
అందరూ కలిసి ఏపీ హక్కులను కాపాడేందుకు నడుం బిగించాలన్నారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ దిద్దుకోలేని తప్పు చేసి, ప్రజల చీత్కారానికి గురయిందని, ప్రస్తుతం అనుభవిస్తోందని, టిడిపికి కూడా అదే గతి పట్టకుండా చూసుకోవాలని హెచ్చరించారు.
ఏపీకి హోదా వస్తేనే పరిశ్రమలకు ప్రోత్సాహకరమని, అప్పుడే రాష్ట్రానికి భారీ కంపెనీలు వస్తాయి తప్ప, పరిస్థితి ఇలాగే ఉంటే, చంద్రబాబు వంద దేశాలు తిరిగినా, వెయ్యి విమానాలలో వెళ్లినా ఒక్క రూపాయి రాదన్నారు. ఆయన ప్రజాధనం వృథా చేస్తున్నారన్నారు.
ప్రత్యేక హోదా కోసం పోరాడి, దానిని సాధించుకుంటే అన్ని దేశాల నుంచి పెట్టుబడులు వస్తాయన్నారు. ప్రపంచాన్ని తీసుకు వచ్చే శక్తి హోదాకు ఉందన్నారు. హక్కుల సాధన, రాష్ట్ర డిమాండ్, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పనులు చేయుంచుకోవడంలో తెరాస ఎంపీలను చూసి సిగ్గు తెచ్చుకోవాలన్నారు.
జగన్, బాబు, బీజేపీలదే బాధ్యత, మేం చూసుకుంటాం: హోదాపై రఘువీరా
ప్రత్యేక హైకోర్టు కోసం తెరాస ఎంపీలు పార్లమెంటులో గట్టిగా నిరసన తెలపాలని నిర్ణయించారని, వారు వెల్లోకి దూసుకుపోవాలని భావిస్తున్నారని, హోదా కోసం టిడిపి ఎంపీలు ఒక్కసారైనా అటువంటి పని చేయలేదన్నారు. కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలన్నారు.
లేదంటే తదుపరి జరిగే పరిణామాలకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబును హెచ్చరించారు. ఏపీకి అన్యాయం జరిగిన పాపంలో ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం ఉందన్నారు. దానిని సరిదిద్దుకోవాలని హితవు పలికారు. బీజేపీ పాలనా పగ్గాలు చేపట్టి రెండేళ్లు దాటినా, నేతలు సిగ్గూ శరం లేకుండా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రత్యేక హోదా విషయంలో మీనమేషాలు లెక్కించవద్దన్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడకుండా, మీరేం చేస్తారో చెప్పాలన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. ఎంపీలు చేస్తున్నది ప్రజాసేవ కాదని, ముమ్మాటికీ వ్యాపారమేనన్నారు.
ప్రయివేటు బిల్లును ఎలా తప్పించుకోవాలని టిడిపి చూస్తోందన్నారు. బిల్లు వస్తే చూద్దామని బీజేపీ ఎంపీ హరిబాబు చెప్పడంతో బిల్లు రాకుండా అడ్డుకుంటారన్న అనుమానాలు పెరుగుతున్నాయన్నారు. బీజేపీ నేతలు ఒంటినిండా విషం నింపుకున్నారని ధ్వజమెత్తారు.
అమరావతిలో సినీ పరిశ్రమపై...
రాజధాని కోసం రైతులు 33వేల ఎకరాలు ఇస్తే, మీరు దానిని పంచుకుంటారా, ఏం రాజ్యం నడుస్తోందన్నారు. సినీ పరిశ్రమ ఎప్పుడు రాజధానిలోనే ఉండాలని, క్యాపిటల్ సిటీకి గ్లామర్ కావాలన్నారు. అది సినీ పరిశ్రమతోనే వస్తుందన్నారు.
రాజధానిలో స్టూడియోలు, గార్డెన్స్ ఉండాలే తప్ప, మీకు భూములున్న చోట మీ మంత్రులు, వారి అనుచరులు బినామీలు ఉన్న చోట కాదన్నారు. బెంగళూరు, చెన్నై, ముంబై నగరాలను చూడాలన్నారు. ఆ రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ ఎక్కడుందో చూడాలన్నారు.