వైసిపికి షాక్: పని చేయలేకపోతున్నా... జగన్కు కోలగట్ల రాజీనామా లేఖ
విజయనగరం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. వైసిపి నేత కోలగట్ల వీరభద్ర స్వామి విజయనగరం నియోజకవర్గ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు.
విజయనగరం: విజయనగరం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. వైసిపి నేత కోలగట్ల వీరభద్ర స్వామి విజయనగరం నియోజకవర్గ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు.

అధినేతకు కోలగట్ల లేఖ
ఈ బాధ్యతలు మరొకరికి అప్పగించాలని ఆయన పార్టీ అధినేత వైయస్ జగన్కు సూచించారు. ఈ మేరకు ఆయన అధినేతకు లేఖ రాశారు. నియోజకవర్గంలో కొందరితో కలిసి పని చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన వాపోయారు.

బొత్సతో విభేదాల్లేవు
తమ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో తనకు ఎలాంటి విభేదాలు లేవని కోలగట్ల చెప్పారు. ఆయనతో కలిసి పని చేసేందుకు సిద్ధమని తెలిపారు. నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతల నుంచి మాత్రం తప్పుకుంటున్నట్లు చెప్పారు.

వ్యక్తిగత కారణాలు, కొంతమంది నేతల వల్లా
2014 నుంచి తాను విజయనగరం శాసన సభ నియోజకవర్గానికి వైసిపి ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నానని కోలగట్ల చెప్పారు. ఇప్పుడు వ్యక్తిగత కారణాలతోను, అదే విధంగా కొంతమంది నేతలతో కలిసి పని చేయలేని పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

పార్టీతోనే కోలగట్ల
కాగా, నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల అనంతరం పలువురు వైసిపి నేతలు టిడిపి వైపు చూస్తున్నట్లుగా ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలో అసంతృప్తితో కోలగట్ల ఇంచార్జిగా రాజీనామా కలకలం సృష్టించింది. కానీ ఆయన పార్టీతోనే పని చేస్తారు. కానీ పార్టీలోనే కొందరు నేతలతో కలిసి పని చేయలేకపోతున్నానని ఆయన చెప్పడం గమనార్హం.

గతంలో బోత్సపై అసంతృప్తితో అలక
గతంలో కోలగట్ల అధినేతపై అలక వహించిన సందర్భాలున్నాయి. ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన బొత్స సత్యనారాయణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై జగన్ పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. బొత్సకు అధిక ప్రాధాన్యత ఇస్తే తమ నాయకుడు టిడిపిలో చేరుతారని పది నెలల క్రితం ఆయన అనుచరులు హెచ్చరికలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications