ప్రేమ పేరుతో వల: పథకం ప్రకారం దోపిడీ, అరెస్ట్

హైదరాబాద్లో సివిల్ కాంట్రాక్ట్ పనులు చేసే రాము, రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించే అప్పన్న మధు స్నేహితులు. వారిద్దరూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందినవారు. కొద్ది రోజులుగా ఆర్థికంగా ఎదుగుతున్న మధును చూసి ఓర్వలేక రాము అతడిని దెబ్బ కొట్టాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో తనకు పరిచయం ఉన్న విజయవాడ భారతీయ నగర్లో ప్రైవేట్ మార్కెటింగ్ పని చేసే కొత్తూరు తాడేపల్లికి చెందిన అనుమోలు రాజేష్, జక్కంపూడికి చెందిన లారీ డ్రైవర్ అంబటి సుబ్బారావు, అజిత్నగర్కు చెందిన వేనిగెల శ్రీనివాసరావు, తాపీ పని చేసే షాబాద్కు చెందిన తోట సాయి దుర్గారావు, హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన మజ్జి పద్మను సంప్రదించాడు.
మధును ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు సహకరించాలని కోరాడు. దీంతో అందరూ కలసి పథకం వేశారు. మధు సెల్ఫోన్కు మజ్జి పద్మ ఫోన్ చేసి ప్రేమ పేరుతో పరిచయం పెంచుకుంది. ఈ నెల5న తనతో మాట్లాడేందుకు విజయవాడ శివారు ప్రాంతమైన జక్కంపూడికి రమ్మని పద్మ ఆహ్వానించగా మధు అక్కడికి వెళ్లాడు. జక్కంపూడి శివారు ప్రాంతంలో వారు మాట్లాడుకుంటున్న సమయంలో పథకం ప్రకారం రాజేష్, సుబ్బారావు, సాయిదుర్గారావు అకస్మాత్తుగా అక్కడికి వచ్చి తాము పోలీసులమని, నిర్మానుష్య ప్రదేశంలో ఏం చేస్తున్నారని మధు, పద్మను బెదిరించారు.
ఆ ముగ్గురు తనకు తెలియదన్నట్టుగా పద్మ సమీపంలో తన బాబాయి ఉన్నాడని తెలియజేసి వేనిగెల శ్రీనివాసరావును అక్కడకు రప్పించి అక్కడి నుంచి జారుకుంది. అనంతరం రాజేష్, సుబ్బారావు, సాయిదుర్గారావు మధును పోలీసుల పేరుతో బెదిరించి అతడి వద్ద ఉన్న బంగారు బ్రాస్లెట్, చైన్, ఉంగరాలు మొత్తం 8 కాసుల నగలను దోపిడీ చేశారు.
కొంతసేపటికి తేరుకున్న మధు పోలీసు స్టేషన్కు చేరుకుని జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ప్రధాన సూత్రధారి రాముతో పాటు అనుమోలు రాజేష్, అంబటి సుబ్బారావు, వేనిగెల శ్రీనివాసరావు, తోటసాయిదుర్గారావు, మజ్జి పద్మలను అరెస్టు చేశారు. సుమారు రూ. 2లక్షల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications