ఏపీ అసెంబ్లీలో కీలక కమిటీ నియామకం-భూమన చేతికి పగ్గాలు..!
ఏపీ అసెంబ్లీలో వైసీపీకీ 151 సభ్యుల సొంత బలంతో పాటు మరో ఐదుగురు టీడీపీ,జనసేన సభ్యుల బలం కూడా ఉండేది. వీరితో కలుపుకుంటే అసెంబ్లీలోని మొత్తం 175 సీట్లలో 156 సభ్యుల బలం ఉండేది. కానీ తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తర్వాత నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై జగన్ సస్పెన్షన్ వేటు వేయడంతో అది కాస్తా 152కు తగ్గింది. అయినా ఇప్పటికీ అసెంబ్లీలో వైసీపీకి కనీస ప్రతిపక్షమే లేదు. ఇలాంటి తరుణంలో అసెంబ్లీలో ఓ కీలక కమిటీ నియామకం జరిగింది.
ఏపీ అసెంబ్లీలో తాజాగా సభా హక్కుల కమిటీ నియామకం జరిగింది. గతంలో ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ ఉండేది. దాని పదవీకాలం పూర్తి కావడంతో స్పీకర్ తమ్మినేని ఆరుగురు సభ్యులతో కొత్త ప్రివిలేజ్ కమిటీని నియమించారు. ఇందులో తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కీలక స్ధానం దక్కింది. భూమనను ఈ కమిటీకి ఛైర్మన్ గా నియమించారు. ఆయనతో పాటు సభ్యులుగా మరో ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఓ టీడీపీ ఎమ్మెల్యేకు చోటు దక్కింది.

ఏపీ అసెంబ్లీ సభా హక్కుల కమిటీకి భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వం వహించనుండగా.. వైసీపీ ఎమ్మెల్యేలు కోన రఘుపతి, అబ్బాయ్ చౌదరి, భాగ్యలక్ష్మి, సుధాకర్ బాబు, చిన అప్పలనాయుడు, టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని ఆదేశాలు జారీ చేసారు. వీరు అసెంబ్లీలో సభ్యుల హక్కులకు భంగం కలిగినట్లు ఫిర్యాదులు అందినప్పుడు వాటిపై విచారణ చేసి స్పీకర్ కు నివేదిక ఇస్తారు. దాని ఆధారంగా స్పీకర్ చర్యలు తీసుకుంటారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాకాణి గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో సభా హక్కుల కమిటీ నియమించారు. ఈ కమిటీ టీడీపీ పక్ష ఉపనేత అచ్చెన్నాయుడుతో పాటు మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ స్పీకర్ తమ్మినేని సీతారాంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపింది. అచ్చెన్నాయుడు తప్పు చేసినట్లు నిర్దారించింది. ఆ తర్వాత ఆయన క్షమాపణ చెప్పారు. కూన మాజీ ఎమ్మెల్యే కావడంతో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. ఆ తర్వాత కమిటీ టీడీపీ హయాంలో పెగాసస్ వాడకంపైనా విచారణ జరిపి నివేదిక ఇచ్చింది. చివరికి పదవీకాలమే ముగిసింది.












Click it and Unblock the Notifications