స్మగ్లర్ల కోసం వేట, 100మంది అరెస్ట్: ఆయుధమే ఉంటే..
ఆదివారం సాయంత్రం నుండి టాస్క్ఫోర్స్ పోలీసులు వారికోసం గాలిస్తున్నారు. పోలీసుల నుండి తప్పించుకొని కడప జిల్లా కోడూరు, మామడూరు రైల్వే స్టేషన్కు చేరుకున్న దాదాపు వందమంది స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేస్తున్న సమయంలో స్మగ్లర్లు పోలీసులపై తిరగబడ్డారు. శేషాచలం అడవుల్లోను వేట మొదలైంది.
గతంలోను శ్రీధర్పై దాడులు
ఎర్ర చందనం స్మగ్లర్ల దాడిలో ఇద్దరు అటవీ శాఖ అధికారులు మృతి చెందగా, పలువురు గాయపడ్డ విషయం తెలిసిందే. మృతి చెందిన వారిలో శ్రీధర్, డేవిడ్ కరుణాకర్లు ఉన్నారు. కాగా, శ్రీధర్ పైన గతంలో స్మగ్లర్లు రెండుసార్లు దాడులకు పాల్పడ్డారు. బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్లలోనే వేటగాళ్ల తూటాలకు ఒళ్లంతా తూట్లు పడ్డాయి. చిత్తూరు సమీపంలోని గంగనపల్లెకు చెందిన విశ్రాంత సైన్యాధికారి రామచంద్ర నాయుడు కొడుకు శ్రీధర్.
గతంలో రెండుసార్లు స్మగ్లర్లు శ్రీధర్ వాహనాన్ని వేరే వాహనాలతో ఢీకొట్టించి తుదముట్టించే ప్రయత్నం చేశారు. రెండేళ్ల కింద తిరుమల సెక్షన్ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. డేవిడ్ కరుణాకర్ 15 ఏళ్ల కిందట అటవీశాఖలో గార్డ్గా విధుల్లో చేరారు. పదోన్నతిపై బీట్ ఆఫీసర్గా నియమితులయ్యారు.
ఆయుధం ఉండే బతికేవాడు
చేతిలో ఒక ఆయుధం ఉండుంటే తన బిడ్డ బతికి ఉండేవాడని స్మగ్లర్ల చేతిలో మృతి చెందిన శ్రీధర్ తల్లిదండ్రులు బోరున విలపించారు. శ్రీధర్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.