రైతు ఆత్మహత్యలపై మంత్రి సోమిరెడ్డి సంచలన వ్యాఖ్య
గుంటూరు: రైతుల ఆత్మహత్యలపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పది లక్షల రూపాయల అప్పు కోసం ఆత్మహత్యలు చేసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు.
"మీ కుటుంబాలు నష్టపోవడం లేదా, పారిశ్రామికవేత్తలు లక్షల కోట్లు ఎగగొడుతన్నారు, పంటలు నష్టపోయినా.. ధరలు పడిపోయినా ప్రభుత్వం ఆదుకుంటోంది కదా" అని ఆయన రైతులను ఉద్దేశించి అన్నారు.
రైతులు ఆత్మహత్యలు వీడొద్ద
రైతులు ఆత్మస్థైర్యం వీడవద్దని ఆయన హితవు పలికారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సోమవారం గుంటూరు సమీపంలోని లాం వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన కిసాన్ మేళా సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడారు.
రైతు ఆత్మహత్యపై
ఇటీవల గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఆవరణలో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. సిర్పూర్ కాగజ్నగర్ పేపరు మిల్లు రైతులకు 14 వందల కోట్ల ఇవ్వాల్సి ఉందని, మిల్లు మూసేశారని, అందులో కొంత మేర ప్రభుత్వం చెల్లించేందకు ముందుకు వచ్చిందని ఆయన చెప్పారు.
అయినా రైతులు ఇలా చేస్తున్నారు
మార్క్ఫెడ్ ద్వారా పదివేల మెట్రిక్ టన్నుల మినుములు కొనుగోలు చేయాలని నిర్ణయించామని, ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేస్తోందని, ఎరుపులు ఇస్తోందని, అయినా రైతులు నకిలీ విత్తనాలు, పురుగుల మందులు వాడుతున్నారని మంత్రి అన్నారు. దీనివల్లనే నష్టాలు సంభవిస్తున్నాయని చెప్పారు.
ఆత్మహత్యలు దురదృష్టకరం
నష్టాలు వస్తున్నాయని రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నార. ప్రభుత్వం అందించే విత్తనాల ఎరువుల నాణ్యతకు, ప్రమాణాలకు అధికారులు బాధ్యత వహిస్తారని అంటూ ప్రైవేట్ వ్యాపారులను ఎందుకు ఆశ్రయిస్తున్నారని ప్రశ్నించారు.
జగన్పై సోమిరెడ్డి నిందలు
భూసార పరీక్షల ఫలితాలు 54 లక్షల మందికి అందించామని, నేల స్వరూప స్వభావాలకు అనుగుణంగా ఏ పంటలు వేయాలో అధికారులు వివరిస్తున్నారని, వీటిపై అవగాహన పెంచుకుంటే ఆత్మహత్యలు నిలువరించవచ్చునని సోమిరెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర పేరిట రైతులను రెచ్చగొడుతూ ఆత్మస్థయిర్యం దెబ్బ తీస్తున్నారని ఆయన విమర్శించారు.