ఏపీలో అరాచక పాలనంటూ సోము వీర్రాజు ఫైర్: ఓ ఎంపీని జగన్ కొట్టారంటూ రామకృష్ణ ఫైర్
అమరావతి: ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై మరోసారి రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో దుర్మార్గమైన పాలన సాగుతోందన్నారు. కేంద్ర నిధులిస్తుంటే జగన్ తన సొంత పథకాల పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఆదాయ వనరుగా చేసుకొని వైఎస్ జగన్ దోచుకుంటున్నారని ఆరోపించారు.
సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వ జోక్యం తగదని సోము వీర్రాజు హితవు పలికారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చేరవేసేందుకు బీజేపీ తరుఫున మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని సోము వీర్రాజు అన్నారు. వైసీపీ పాలనను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.
జగన్ ఓ ఎంపీని కొట్టారు.. ఏపీ సర్కారు భారీ అవినీతి: సీపీఐ రామకృష్ణ
ఏపీ సర్కారు భారీ అవినీతికి పాల్పడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇళ్ల స్థలాల కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి రూ. 10 వేల కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేస్తే.. రూ. 4 వేల కోట్ల అవినీతి చోటు చేసుకుందన్నారు. ఇళ్ల స్థలాల కొనుగోళ్ల విషయంలో ఓ ఎంపీని సీఎం జగన్ చెంప మీద కొట్టారని తమకు సమాచారముందన్నారు.
ఈ ప్రభుత్వం పేదలకు కట్టించేవి ఇళ్లు కాదు.. పందుల గూళ్లుఅని సంచలన వ్యాఖ్యలు చేశారు రామకృష్ణ. గ్రేటేడ్ కమ్యూనిటీ తరహాలో ఇళ్లు కట్టిస్తున్నామంటూ సజ్జల ప్రజలను భ్రమల్లో ఉంచుతుతున్నారన్నారు. పేదలకు కట్టించే ఇంటిలో సజ్జల తన కుటుంబంతో 24 గంటల పాటు ఉండగలరా..? అని ప్రశ్నించారు. తాడేపల్లిలో ప్రభుత్వం నిర్మించిన మోడల్ హౌస్ ఉంది.. అక్కడ సజ్జల 24 గంటలపాటు కుటుంబంతో ఉండగలరా..? అని నిలదీశారు. ఇంటి సామాను మేమే లారీలో తరలిస్తాం. సీఎం జగన్ ఇంటి బాత్రూం కంటే పేదలకు ఇచ్చే ఇంటి స్థలం తక్కువగా ఉందని విమర్శించారు. పేదల ఇళ్ల కోసం పల్లెల్లో మూడు సెంట్లు.. అర్బన్లో రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
అమరావతి పరిధిలో నిర్మించిన టిడ్కో ఇళ్లను కేటాయించకుండా ప్రభుత్వం సైంధవుని మాదిరిగా అడ్డుపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం డబ్బులివ్వాలని రైతులు ధర్నాలు చేస్తుంటే పొలం గట్టు మీదే డబ్బులిస్తున్నామని సజ్జల ఎలా చెబుతారు..? అని ప్రశ్నించారు. పెన్షన్ల విషయంలో జగన్ మాట తప్పారు. రూ. 3 వేలు ఇస్తామన్న సీఎం జగన్.. నిన్నటి వరకు రూ. 2250 ఇచ్చారు.. ఇప్పుడు రూ. 2500 ఇస్తున్నారని అన్నారు. జనవరి 10వ తేదీన సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి చేస్తామని పేర్కొన్నారు.