సంక్రాంతి- శబరిమల స్పెషల్ : 14 ప్రత్యేక రైళ్లు - ఎక్కడ నుంచి ఎక్కడి దాకా..!!
ఒక వైపు సంక్రాంతి రద్దీ.. మరో వైపు శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సందడి. దీంతో..ఇప్పటికే రైళ్లన్నీ ఫుల్ అయిపోయాయి. సాధారణ రైళ్లతో పాలుగా సంక్రాంతి సమయంలో కొద్ది రోజుల క్రితమే ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించారు. అయినా..ఇంకా రెగ్యులర్ రైళ్లల్లో వెయిటింగ్ లిస్టు చాంతాడులా ఉంది. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక సర్వీసుల పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ సమయంలో రద్దీ తగ్గించేందుకు సంక్రాంతి సందర్భంగా విజయవాడ మీదుగా కాకినాడటౌన్-లింగంపల్లి మధ్య 14ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.
14 ప్రత్యేక రైళ్లు
గత రెండేళ్లు కరోనా కారణంగా సంక్రాంతి .. శబరి మల వెళ్లే వారి సంఖ్య గణణీయంగా తగ్గింది. ఈ సారి మాత్రం గతంలో మాదిరిగానే పలువురు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. తాజాగా, దక్షిణ మధ్య రైల్వే శాఖ చేసిన ప్రకటన మేరకు.. రైలు నంబర్ 07275 జనవరి 3, 5, 7 తేదీలలో రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07276) జనవరి 4, 6, 8 తేదీలలో సాయంత్రం 6.40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.10 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.
రూట్ మ్యాప్.. టైమింగ్స్
అదే విధంగా.. రైలు నంబర్ 07491 జనవరి 10, 12, 14, 17 తేదీల్లో రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07492) జనవరి 13, 15, 18 తేదీల్లో సాయంత్రం 6.40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.
ఇక, రైలు నంబర్ 82714 జనవరి 11న సాయంత్రం 6.40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. ఇక, శబరిమలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో కాకినాడ టౌన్ నుంచి శబరిమలకు సైతం ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించారు.
శబరిమల భక్తుల కోసం
అందులో భాగంగా.. శబరిమల వెళ్లే భక్తుల కోసం కాకినాడ టౌన్ నుంచి ఎర్నాకుళంకు ప్రత్యేక రైలు (07147) జనవరి 4, 11 తేదీలలో సాయంత్రం 5 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3.15 గంటలకు ఎర్నాకుళం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07148) జనవరి 5, 12 తేదీలలో రాత్రి 7.00 గంటలకు ఎర్నాకుళంలో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 7.30 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది.
ఇక, కాచిగూడ-నరసాపూర్ వయా గుంటూరు డివిజన్ మీదుగా సువిధ ప్రత్యేక రైలు (82716) జనవరి 11న రాత్రి 11.15 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.40 గంటలకు నరసాపూర్కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07494) జనవరి 12న సాయంత్రం 6.00 గంటలకు నరసాపూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.50 గంటలకు కాచిగూడ స్టేషన్కు చేరుకుంటుంది.