కుదరదు: జగన్తో స్పీకర్, విరుచుకుపడిన మంత్రులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రులు విరుచుకుపడ్డారు. జగన్ నిబంధలను తెలియకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 344 నిబంధన కింద చర్చ చేపట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది.
తనకు మాట్లాడేందుకు రెండున్నర గంటల సమయం కావాలని సభాపతిని అడిగారు. దానికి సభాపతి స్పందిస్తూ.. ఇష్టమొచ్చినంత సమయం కుదరదని చెప్పారు. దీంతో తనకు అవకాశం ఇవ్వడం లేదని జగన్ ఆరోపించారు. వైసీపీ సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లారు.
దీంతో మంత్రులు మండిపడ్డారు. నిబంధనలు తెలియకుండా మాట్లాడుతున్నారని యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు తదితరులు విమర్శించారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. జగన్ వీధిరౌడీలా మాట్లాడుతున్నారని, బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలని హితవు పలికారు. ఆయనను జైలుకు పంపిస్తే తప్ప బాగుపడేలా లేదని విమర్శలు గుప్పించారు. గందరగోళం మధ్య సభాపతి సభను పదినిమిషాలు వాయిదా వేశారు.
సీఆర్డీఏ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
సీఆర్డీఏ సవరణ బిల్లును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. మంత్రి నారాయణకు బదులు మంత్రి అయ్యన్నపాత్రుడు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. మూడు సవరణలను ప్రతిపాదిస్తూ బిల్లు ప్రవేశపెట్టారు.