విజయవాడ, విశాఖపట్నం వాసులకు తిరుమలలో ప్రత్యేక దర్శనం
తిరుమల కొండపై కొలువైన శ్రీవారిని దర్శించుకోవాలంటే సామాన్య భక్తులకు వైకుంఠంలో ఉన్న భగవంతుడే కనపడుతున్నాడు. ఐదు సంవత్సరాలుగా ఆన్ లైన్ లో దర్శనం టికెట్ల పేరుతో స్వామివారు భక్తులకు దూరమయ్యారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం తిరుమల నుంచే ప్రక్షాళన అని ప్రకటించింది. అందుకనుగుణంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. ఇంతవరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ ను, సభ్యులను నియమించలేదు. ఈవో, జేఈవో పాలనలోనే నడుస్తోంది. భక్తులు కూడా తమకు సమీపంలో ఉన్న వెంకటేశ్వరస్వామివారి దేవాలయానికి వెళ్లి అక్కడే స్వామిని దర్శించుకొని అదే తిరుమల అని తృప్తిపడుతున్నారు.
పర్యాటక శాఖ శుభవార్త
ఇటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో విజయవాడ, విశాఖపట్నం వాసులకు రాష్ట్ర పర్యాటనక శాఖ శుభవార్తను వినిపించింది. అతి తక్కువ ధరలో భక్తులకు స్వామివారి దర్శనం చేయించే బాధ్యతను తీసుకుంది. తిరుపతి వెళ్లాలనుకునేవారికి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. విశాఖపట్నం, విజయవాడ ప్రజలకు ఈ అవకాశం అందుబాటులోకి వచ్చింది. ప్రతిరోజు ఏసీ స్లీపర్ బస్సులో తిరుపతికి తీసుకువెళ్లి స్వామివారి దర్శనం చేయించి తిరిగి తీసుకువస్తారు. దర్శనంతోపాటు వసతి, భోజనాలను కూడా పర్యాటక శాఖే ఏర్పాటు చేస్తుంది.

వసతి, భోజనం వారిదే
విజయవాడ బెంజి సర్కిల్ పిల్లర్ నెంబరు 4 దగ్గర నుంచి ప్రతి రోజు రాత్రి 11.00 గంటలకు బస్సు బయలుదేరుతుంది. వాస్తవానికి ఇది విశాఖపట్నం నుంచి నడుస్తున్న బస్సు. తాజాగా విజయవాడ వాసులకు కూడా అవకాశం కల్పించారు. తెల్లవారుజామున ఆరు గంటలకు తిరుమల చేరుకుంటుంది. కొండపైనే వసతి ఉంది. ఉదయం అల్పాహారం అయిన తర్వాత పదిగంటలకు స్వామివారి దర్శనం ఉంటుంది. మధ్యాహ్న భోజనం ముగిసిన తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం కూడా ఉంటుంది. తిరిగి రాత్రి ఏడుగంటలకు భోజన సౌకర్యం కల్పిస్తారు. అర్థరాత్రికి తిరుపతి నుంచి బయలుదేరి తర్వాత రోజు ఉదయానికి విజయవాడ చేరుకుంటుంది. ఈ ప్యాకేజీ తీసుకోవాలనుకునేవారు 0866-2571393, 94402 51775, 98480 07025 నెంబర్లలో సంప్రదించాలి. పెద్దలకు రూ.3970, పిల్లలకు రూ.3670 చెల్లించాల్సి ఉంటుంది. విజయవాడతోపాటు సమీప ప్రాంతాల ప్రజలకు ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications