ఎపికి అప్పుడే ఇచ్చేశాం, బయటపెడ్తాం: వెంకయ్యపై దిగ్విజయ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని తమ యూపీఏ ప్రభుత్వమే ప్రత్యేక హోదా ఇచ్చిందని, దానికి మంత్రి వర్గ ఆమోదం లభించిందని, ఆ ఉత్తర్వులను బయటపెడతామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పారు. నాటి ప్రధాని మన్మోహన్ సీమాంధ్రకు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా అని ప్రకటిస్తే, బీజేపీ నేతలు మాత్రం పదేళ్లు కావాలని పట్టుబట్టారని తెలిపారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమంటున్నారని విమర్సించారు. యుపిఎ ప్రత్యేక హోదా ఇవ్వలేదని వెంకయ్య నాయుడి మాటలకు జవాబు ఇస్తూ అందుకు సంబంధించిన ఉత్తర్వులను బయటపెడ్తామని దిగ్విజయ్ సింగ్ అన్నారు.
ప్రత్యేక హోదా, విభజన సందర్భంగా నవ్యాంధ్రకు ఇచ్చిన ఇతర హామీలను అమలు చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఈ దిశగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు గురువారం దిగ్విజయ్, ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఏఐసీసీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు కొప్పుల రాజు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను కలిశారు.
ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని తాను రాజ్యసభలో ప్రకటించినప్పుడు, పదేళ్లు కావాలని కోరిన వారు ఇప్పుడెలా వెనక్కి వెళ్తారని మన్మోహన్ ఆశ్చర్యపోయినట్లు చెబుతున్నారు. దీనిపై రాబోయే పార్లమెంటు సమావేశాల్లో తానే ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో దిగ్విజయ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో కొందరు కాంగ్రెస్ ఎంపీలు, నాటి కేంద్ర మంత్రులు ఏపీ ప్రయోజనాల కోసం పోరాడారని, ఏపీలో కేంద్ర సంస్థలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, వెనుకబడ్డ ప్రాంతాలకు నిధులు, కొత్త రాజధానికి ఆర్థిక సహాయం, బడ్జెట్ లోటును భర్తీ చేసేందుకు నిధులు వంటివి రాబట్టారని ఆయన చెప్పారు.

కాంగ్రెస్కు ఏపీలో ఆదరణ లభించకపోయినా, ప్రజల కోసం తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. విభజన చట్టంలో ఉన్న, రాజ్యసభలో ప్రధాని హోదాలో మన్మోహన్ ఇచ్చిన హామీలను అమలు చేసేలా పోరాడతామని చెప్పారు. ఈ హామీలు అమలు చేయాలని ప్రధాని మోదీకి గత ఏడాది జూన్లోనే సోనియా గాంధీ లేఖ రాశారని గుర్తు చేశారు. ఆయా హామీలన్నింటినీ రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొనాలని, జాతీయ బడ్జెట్, రైల్వే బడ్జెట్ల్లో నిధులు కేటాయించాలని కోరుతూ ఇప్పుడు మరొకమారు ప్రధానికి సోనియా లేఖ రాస్తారని దిగ్విజయ్ తెలిపారు.
హామీల అమలుపై చేపట్టిన కోటి సంతకాలను స్వీకరించేందుకు సోనియాగాంధీ ఏపీకి వస్తారన్నారు. బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. తర్వాత కోటి సంతకాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సమర్పిస్తారని వివరించారు.
తమ పార్టీ సీఎంలు కూడా ప్రత్యేక హోదాకు డిమాండ్ చేయొచ్చు గానీ ఆంధ్రప్రదేశ్కు ఇస్తే వ్యతిరేకించరని దిగ్విజయ్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పోలవరం నిర్వాసితులకు మంచి పునరావాస ప్యాకేజీ కావాలని మాత్రమే తెలంగాణ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని, ప్రాజెక్టును వ్యతిరేకించటం లేదని చెప్పారు. విభజన చట్టంలో చాలా లోపాలున్నాయని కేంద్ర మంత్రి వెంకయ్య చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేయగా, ఈ లోపాలన్నింటినీ సరి చేయొచ్చునని తెలిపారు.












Click it and Unblock the Notifications