జగన్కు కృతజ్ఞతలు చెప్పిన ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ధార్మిక వ్యవహారాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా సలహాదారుని నియమించింది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఈ మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. టీటీడీకి సంబంధించినంత వరకు ఇది అత్యుత్తమ పదవి. ధార్మిక కార్యక్రమాల సలహదారుగా ప్రఖ్యాత ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావును నియమించింది. టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమించడం ఇదే తొలిసారి.

ప్రవచనకర్తగా ఇంటింటికీ పరిచయం..
బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు తెలియని వారుండరు. ఆయన పేరు వినని వారుండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రవచనకర్తగా సుపరిచితులు ఆయన. ప్రవచనకర్తగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం చాలాకాలంగా కృషి చేస్తున్నారు. నిజానికి- ఆయన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఫుడ్ కార్పొరేషన్ లో పని చేస్తోన్నారు. కాకినాడ.. ఆయన స్వస్థలం.

అష్ఠాదశ పురాణాలు ఆయన పుక్కిట..
అష్ఠాదశ పురాణాలను అధ్యయనం చేశారు. తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలు చెబుతుంటారు. ఆదిశంకరాచార్య వైభవం, శ్రీకాళహస్తీశ్వర వైభవం, శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీవేంకటాచల వైభవం, సుందరకాండ..వంటి 163 అంశాల మీద ప్రవచనాలను అలవోకగా వివరించగల శక్తి సామర్థ్యాలు చాగంటి కోటేశ్వరరావు సొంతం. తన పరిధి మేరకు ఆయన హైందవ ధర్మాన్ని వ్యాప్తి చేస్తోన్నారు.

ధార్మిక కార్యకలాపాలను విస్తృతం చేయడంలో భాగంగా..
దీన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమల ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమించింది. ఈ మేరకు ధర్మ ప్రచార పరిషత్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. త్వరలోనే ఆయన బాధ్యతలను స్వీకరిస్తారని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

జగన్ తో భేటీ..
ఈ పరిణామాల మధ్య చాగంటి కోటేశ్వర రావును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్కరించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో శ్రీవేంకటేశ్వరస్వామి వారి ప్రతిమ అందజేశారు. ఆ సమయంలో చాగంటి వెంట శాంతా బయోటెక్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వర ప్రసాద్ రెడ్డి ఉన్నారు. అనంతరం చాగంటి కోటేశ్వర రావు ముఖ్యమంత్రి నివాస ప్రాంగణంలో ఉన్న గోశాలను సందర్శించారు. గోశాలను ఏర్పాటు చేయడం అత్యుత్తమ నిర్ణయమని ప్రశంసించారు.












Click it and Unblock the Notifications