తిరుపతి లడ్డు కల్తీ వేళ విశాఖపట్నంపై టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల శ్రీవారి అత్యంత పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని భక్తులందరికీ అందుబాటులోకి తెస్తున్నామని ఈవో శ్యామలరావు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల్లో లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తుంటారు. అయితే వారానికి మూడు రోజులు లేదంటే రెండురోజులే అమ్మకానికి ఉంచుతారు.
భక్తుల నుంచి లడ్డూలు కావాలనే డిమాండ్లు ఎక్కువగా వస్తుండటంతో తిరుమలలో దళారులను కట్టడి చేయడంతోపాటు అక్రమ మార్గాల్లో తరలిపోతున్న లడ్డూలకు ఈవో అడ్డుకట్ట వేశారు. దీంతో బయటిప్రాంతాలకు ఎక్కువ లడ్డూలను పంపించడానికి వీలవుతోంది.
వారంలో అన్నిరోజులు
విశాఖపట్నంలోని ఎండాడలో తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఇకనుంచి ప్రతిరోజు తిరుమల లడ్డూలను విక్రయించనున్నారు. ఇంతకుముందు గురువారం, శుక్రవారం, శనివారం మాత్రమే అమ్మకానికి ఉంచేవారు. ఇకనుంచి వారంలో అన్నిరోజులు తిరుమల లడ్డూలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ విషయాన్ని ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యలు వెల్లడించారు. ఈ ఆలయంతోపాటు హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబయిలోని టీటీడీ ఆలయాలతోపాటు సమాచార కేంద్రాల్లో శ్రీవారి లడ్డూలు అందుబాటులోకి వచ్చాయి.

కోరుకున్న సంఖ్యలో ఇవ్వనున్నారు
ఇక్కడ భక్తులకు అందుబాటులో ఉన్నదాన్నిబట్టి కోరుకున్న సంఖ్యలో లడ్డూలను ఇవ్వనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిరోజు 3.5 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయిస్తోంది. అందులో కేవలం 2.5 లక్షల లడ్డూలే భక్తులవద్దకు చేరుతున్నాయి. మిగతావన్నీ పక్కదారి పడుతున్నాయి. కొందరు దళారులు తిరుమల లడ్డూలను తీసుకువెళ్లి పెళ్లిళ్లల్లో, ఇతర ఫంక్షన్లలో పంచుతున్నట్లు ఈవో గుర్తించారు. అలాగే లడ్డూ కౌంటర్లలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా పక్కదారి పడుతున్నట్లు తితిదే విచారణలో తేలింది. మొత్తానికి ఏపీలోని అన్ని తితిదే ఆలయాలు, సమాచార కేంద్రాల్లో ఎట్టకేలకు స్వామివారి లడ్డూలు అందుబాటులోకి రావడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాతే తిరుమల ప్రక్షాళన జరుగుతోందంటున్నారు.












Click it and Unblock the Notifications