Gangamma in Pyderu : పైడేరు వాగులో అద్భుత దృశ్యం... సాక్షాత్తు గంగమ్మ తల్లే తరలివచ్చింది...
నెల్లూరు జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కొడవలూరు మండలం గండవరం గ్రామంలోని పైడేరు వాగులో ఓ విగ్రహం ప్రత్యక్షమైంది. భారీ వర్షాలకు వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన విగ్రహం... అచ్చు ఎవరో వాగులో ప్రతిష్ఠించినట్లుగా ఉండిపోయింది. అంత వరదలోనూ విగ్రహం అక్కడి నుంచి కదలకపోవడం గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లే తమ గ్రామానికి తరలివచ్చిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మొదట గండవరం గ్రామానికి చెందిన కొంతమంది పిల్లలు ఆ విగ్రహాన్ని గుర్తించారు. విషయాన్ని గ్రామస్తులకు చెప్పడంతో అంతా అక్కడికి క్యూ కట్టారు. వాగు మధ్యలో ప్రతిష్ఠించినట్లుగా ఉన్న విగ్రహాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. గ్రామంపై కరుణ కటాక్షాలు కురిపించేందుకు ఆ చల్లని తల్లి వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. గ్రామంలో ప్రసిద్ధ ఉదయకాలేశ్వర స్వామి ఆలయం ఉండటంతో... ఆ పరమ శివుడిని వెతుక్కుంటూ గంగమ్మ తల్లి గండవరం చేరిందని అంటున్నారు.అంతటి వరద ప్రవాహంలోనూ ఆ విగ్రహం ఇంచు కూడా కదలకపోవడం ఆ తల్లి మహిమనేనని అభిప్రాయపడుతున్నారు.
గ్రామస్తుల మాట ఎలా ఉన్నా ఆ విగ్రహం ఎక్కడినుంచి వచ్చిందన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఎగువ నుంచి వస్తున్న వరదలో విగ్రహం కొట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైనా వాగులో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైందని గ్రామస్తులు సంతోషపడుతున్నారు.