ఆ 38 మంది ఏమయ్యారు : 315 అడుగుల లోతులో బోటు: రెండు రోజులు పూర్తయినా..!!
బోటు ప్రమాదం జరిగి రెండు రోజులు పూర్తయింది. ఇప్పటి వరకు మొదట దొరికిన ఎనిమిది మినహా ఒక్క మృతదేహం కూడా బయట పడలేదు. ప్రమాదానికి గురైన బోటు గోదావరి ఉపరితలం నుంచి 315 అడుగుల లోతులో ఉన్నట్లు రెస్క్యూ బృందాలు గుర్తించాయి. ఆచూకీ లభ్యం కాని 38 మంది బోటు లోపలే ఉండిపోయారా..గోదావరి దిగువ భాగానికి కొట్టుకుపోయారా అనేది స్పష్టం కాలేదు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల నుంచి ఒక మృతదేహం కిందికి కొట్టుకుని పోయినట్టు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. మొదట దొరికిన ఎనిమిది మినహా ఒక్క మృతదేహం కూడా బయట పడలేదు. కచ్చులూరు నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ 80 మంది ఎన్డీఆర్ ఎఫ్ సభ్యులు, ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం, నౌకాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు, నౌకాదళ సిబ్బంది విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా ఉపయోగం లేకపోయింది. దీంతో.. తమ వారి ఆచూకీ కోసం బంధువులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తోంది.
38 మంది ఏమయ్యారు...బంధువుల ఆందోళన
కచ్చులూరు మందం వద్ద ప్రమాదానికి గురైన బోటులో ప్రయాణించిన ఇంకా 38 మంది ఆచూకీ తెలియలేదు. ప్రమాదం జరిగి రెండు రోజులు పూర్తయింది. ఆ సమయం నుండి రెస్క్యూ బృందాలు పని చేస్తూనే ఉన్నాయి. కచ్చులూరు నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ 80 మంది ఎన్డీఆర్ ఎఫ్ సభ్యులు, ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం, నౌకాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు, నౌకాదళ సిబ్బంది విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా ఉపయోగం లేకపోయింది. దేవీపట్నం సమీపంలో నెలల వయసున్న పసిబిడ్డ మృతదేహం దొరికింది కానీ.. ఆ మృతదేహం పడవ ప్రమాదానికి సంబంధించింది కాదేమోనని అధికారులు అనుమానిస్తున్నారు.
ప్రమాదసమయంలో పడవలో ఉన్న 73 మందిలో 27 మంది సురక్షితంగా బయటపడగా, గల్లంతైన వారిలో ఎనిమిది మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. వారి వివరాలను కూడా అధికారులు గుర్తించారు. ఆచూకీ లభ్యం కాని 38 మంది బోటు లోపలే ఉండిపోయారా.. గోదావరి దిగువ భాగానికి కొట్టుకుపోయారా అనేది స్పష్టం కాలేదు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల నుంచి ఒక మృతదేహం కిందికి కొట్టుకుని పోయినట్టు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. కానీ ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు. మృతదేహం సముద్రంలోకి వెళ్లి పోయే అవకాశం ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని సరిహద్దుల వెంబడి గాలింపు చర్యలు రాత్రి వేళ కూడా కొనసాగుతున్నాయి. మృతదేహాలు ఎగువ నుంచి నదిలో కొట్టుకు రావచ్చన్న సమాచారంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 175 గేట్లను పూర్తిగా కిందకు దించేసి బలమైన నైలాన్ వలలను ఏర్పాటు చేశారు. అక్కడ లైటింగ్ ఏర్పాట్లు కూడా చేశారు.
315 అడుగుల లోతులో బోటు..
ప్రమాదానికి గురైన బోటు గోదావరి ఉపరితలం నుంచి 315 అడుగుల లోతులో ఉన్నట్లు రెస్క్యూ బృందాలు గుర్తించాయి. మరోవైపు ప్రమాద స్థలానికి ఇరువైపులా ఎత్తైన కొండలున్నాయి. ఈ రెండు కారణాల వల్ల బోటును వెలికి తీయటం చాలా కష్టంతో కూడుకున్న పని అని నేవీ, పోర్టు వర్గాలు చెబుతున్నాయి. కొండ ప్రాంతం కావడంతో బోటును వెలికి తీయడానికి ఉపయోగించే క్రేన్లను అక్కడకు తరలించటం సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో బోట్ల సహాయంతోనే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంటుంది. వరకూ విశాఖ, మంగళగిరి ప్రాంతాల నుంచి 60 మంది, విశాఖ, కాకినాడ నుంచి 80 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఓఎన్జీసీ హెలికాప్టర్, 8 రకాల బోట్లు, 12 ఆస్కా లైట్లు, ఆ ప్రాంతాలకు చెందిన ఈతగాళ్లు గాలించినా ఒక్క మృతదేహం కూడా లభ్యం కాలేదు.
గజ ఈతగాళ్లు, నేవీ డైవర్లు
ప్రమాదానికి గురైన బోటు జాడను గుర్తించేందుకు గజ ఈతగాళ్లు, నేవీ డైవర్లు నీటి ప్రవాహంలోనే వెతుకుతున్నారు. వారు కూడా కేవలం 60 అడుగులు లోతు వరకే వెళ్లగలుగుతారు. ఈ పరిస్థితుల్లో 315 అడుగుల లోతులో బోటు ఎక్కడ ఉందనేది గుర్తించడం కష్టమేనంటున్నారు. బోటును గుర్తించేందుకు సైడ్ స్కాన్ సోనార్ నేవీకి చెందిన డీప్ డైవర్స్తో కూడిన బృందం తోపాటు ఉత్తరాఖండ్కు చెందిన నిపుణుల బృందం కూడా చేరుకుంది. వీరి వద్ద ఉన్న సైడ్ స్కాన్ సోనార్ ద్వారా బోటు కచ్చితంగా ఎక్కడ ఉందనేది గుర్తిస్తారు. తర్వాత బోటును బయటకు తీసే అవకాశాల్ని పరిశీలిస్తారు. అధికారులు ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే మకాం వేసారు. బోటు దొరికితేనే అందులో గల్లంతు అయిన వారి ఆచూకి తెలిసే అవకాశం ఉంది.