గణతంత్ర రోజున విషాదం: జెండా కోసం ప్రాణాలొదిలిన విద్యార్థి
అనంతపురం: గణతంత్ర దినోత్సవం రోజు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. జాతీయ జెండాను రెపరెపలాడేలా చేద్దామనుకున్న ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డాడు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కావేటిసముద్రం గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి, రాజేశ్వరి కుమారుడు వంశీవర్దన్రెడ్డి (13) 8వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం మనోజ్కుమార్ అనే రెండోతరగతి విద్యార్థితో కలిసి గ్రామంలో ఆడుకుంటుండగా పంచాయతీవారు ఎగురవేసిన జెండా ముడుచుకుపోయి ఉండడాన్ని గమనించాడు వంశీ.
వెంటనే జెండాను సరిచేసేందుకు పైపు(స్తంభం) ఎక్కడానికి ప్రయత్నించగా అది వాలిపోయి విద్యుత్తు తీగలపై పడటండంతో షాక్ కొట్టి అపస్మారక స్థితిలోకి వెళిపోయాడు. కిందనున్న చిన్నారికి స్వల్పగాయాలయ్యాయి.
గమనించిన గ్రామస్తులు వెంటనే ఇద్దర్నీ ఆటోలో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకుకెళ్లగా వంశీవర్దన్రెడ్డి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. తీవ్ర గాయాలపాలైన మరో చిన్నారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.