ట్రిపుల్ ఐటీలో విద్యార్ధిని అనుమానాస్పద మృతి, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విషాదం
అమరావతి: ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ విద్యార్ధిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సోమవారం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ట్రిపుల్ ఐటీలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని వస్మాల్ హాస్టల్లో ద్రవపదార్ధం తాగి బలవన్మరణానికి యత్నించింది.
వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్ధిని అనారోగ్యంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విషాదం
కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి బిడ్డకు విషమిచ్చి, ఆ తర్వాత ఆమె కూడా తాగిన ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం, ఎమ్మినగనూరులోని ఎస్పీఎం కాలనీకి చెందిన బొజ్జమ్మ (30) తన భర్త రెండో వివాహం చేసుకున్నాడని మసస్తాపంతో ఐదేళ్ల వయసున్న కొడుకుకు విషం తాగించింది.
ఆ తర్వాత ఆమె కూడా తాగింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు:
అనంతపురం జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాకి చెందిన ఇద్దరు వ్యక్తులు కారులో బెంగుళూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో చెన్నేకొత్తపల్లి సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆ కారు డివైడర్ను ఢీకొట్టింది.
దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని పోలీసులు ధర్మవరం ఆసుపత్రికి తరలించారు.