జగన్ మావయ్యా... మాకు బస్సులు కావాలి.. పంపించరా!!
''జగన్ మావయ్యా.. మీరేమో మాకు విద్యాపరంగా అన్నిరకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెబుతున్నారు... కానీ నాయకులెవరూ పట్టించుకోవడంలేదు.. అధికారులు అసలు స్పందించడంలేదు.. బడికి వెళ్లేందుకు బస్సుల్లేవు.. మీరు మాట్లాడి మాకు బస్సులు వేయించరా..'' అంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్టీసీ డిపోవద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. కనిగిరి ఆదర్శ పాఠశాలకు బస్సులు నడపాలని డిమాండ్ చేశారు.
ఆదర్శ పాఠశాల ఏర్పాటు చేసిన సమయంలో రోజుకు మూడు బస్సులు తిరిగేవని, పాసులున్నవారే ఆ బస్సులను ఎక్కుతుండటంతో ఆదాయం రావడంలేదని భావించిన అధికారులు సర్వీసులు రద్దుచేశారని ఆరోపించారు. రెండుగంటలకు పైగా నిరసన కొనసాగించి డిపో నుంచి బస్సులు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఆర్టీసీ సీఐలు, ఎస్ఐలు విద్యా కమిటీ చైర్మన్తో, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో చర్చలు జరిపి ఆందోళన విరమింపచేశారు. రోజుకు రెండు సర్వీసులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
పాఠశాలల విలీనం జరగడంతో ఆర్టీసీ తన సర్వీసులను తగ్గిస్తూ వస్తోంది. దూరంగా ఉన్న ఉన్నత పాఠశాలలకు సైతం ప్రాథమిక పాఠశాలలకు చెందిన విద్యార్థులు వెళ్లాల్సి ఉండటంతో, వారు చిన్నపిల్లు కావడంవల్ల తల్లిదండ్రులే తమ వ్యక్తిగత వాహనాలపై తీసుకువెళ్లడం, తీసుకురావడం చేస్తున్నారు. విలీనాన్ని రద్దుచేసి పాఠశాలలను అలాగే కొనసాగించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.
దీనిపై మంత్రి బొత్స ఇటీవలే వాటిని రద్దుచేయలేదని ప్రకటించినప్పటికీ వాటి విలీన ప్రక్రియ జరుగుతుండటం మాత్రం స్పష్టంగా కనపడుతోందని, విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని యథాతథంగా పాఠశాలలు కొనసాగించాలంటూ సీపీఎం అనుబంధ యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.