హోదాతో రాయితీలు శుద్ద అబద్దం.. కావాలనే రాజకీయం..: చంద్రబాబు
ప్రత్యేక హోదాతో పరిశ్రమలకు రాయితీలు వస్తాయనడం శుద్ధ అబద్ధమని అన్నారు.
విజయవాడ: కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన తర్వాత.. దాన్ని కళ్లకు అద్దుకున్న టీడీపీ ప్రభుత్వం.. ఇది హోదాకు ఏమాత్రం తీసిపోని ప్యాకేజీ అని చెబుతోన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో హోదాతోనే అన్ని సమస్యలు తీరిపోవు.. అంతటా అబివృద్ది సాధ్యపడదు అంటూ చెప్పుకొస్తోంది.
తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోమారు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాతో పరిశ్రమలకు రాయితీలు వస్తాయనడం శుద్ధ అబద్ధమని అన్నారు. పరిశ్రమలకు రాయితీలు ఇస్తామన్న అంశం ప్రత్యేక హోదాలో ఎక్కడా లేదని, పరిశ్రమలు పెట్టేవారికి ప్రభుత్వమే రాయితీ అందిస్తుందని పేర్కొన్నారు.
హోదా ద్వారా ఎంతమేర లబ్ది చేకూరే అవకాశముందో.. ప్యాకేజీతోను అంతే స్థాయిలో అభివృద్ది ఫలాలు అందుతాయని తెలిపారు. కాగా, నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలిక గ్రామంలోని ఇఫ్కో కిసాన్ సెజ్లో ఏర్పాటు చేసిన గమేశా విండ్ పవర్ ప్లాంట్ను శుక్రవారం సీఎం ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన ప్రత్యేక హోదాపై స్పందించారు. విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ పారిశ్రామిక సదస్సు ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు భారీ ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలియజేశారు.
తెలంగాణ-ఏపీ రెండు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేవారి కోసం కేంద్రం రూ.100కోట్ల మేర సబ్సిడీ ఇస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. హోదాపై కొంతమంది కావాలనే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఇక భూసేకరణ గురించి ప్రస్తావిస్తూ పరోక్షంగా వైసీపీని విమర్శించారు చంద్రబాబు. భూసేకరణ విషయంలో ప్రజలను కావాలని రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.