ఒక్కసారిగా వేడెక్కిన ఎపి రాజకీయాలు...ఆ సమయం వచ్చేసిందా?
అమరావతి:ఎపి రాజకీయాల్లో కలకలం రేపే ఏదేని ఘటనలు అతి త్వరలో చోటుచేసుకోబోతున్నాయా?...జరగబోయే పరిణామాల గురించి తెలిసి అన్ని పార్టీలు ఆ పరిస్థితులను తమకు అనుగుణంగా మలుచుకునేందుకు సన్నద్దమవుతున్నాయా?
సంకేతాలు చూస్తుంటే అలాగే ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఢిల్లీలో అనూహ్య సమావేశాలు, ఈ నేపథ్యంలో శుక్రవారం జరగబోయే తమ పార్టీ మీటింగ్ కు టిడిపి ముఖ్యులందరినీ ఆహ్వానించడం చూస్తుంటే ఏదో జరగబోతోందనే పరిస్థితులు కనిపిస్తున్నాయని వారు విశ్లేషిస్తున్నారు. దీంతో ఎపికి సంబంధించిన అన్ని ప్రధాన పార్టీలు అలెర్ట్ అయ్యి జరగబోయే పరిణామాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి....అసలు ఏం జరుగుతుందంటే?...
ఢిల్లీలో...బిజెపి అనూహ్య భేటీలు
గురువారం న్యూ ఢిల్లీలో ఎపి-బిజెపికి సంబంధించి అతిముఖ్యమైన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి, ఆకుల సత్యనారాయణ తదిదరులు తమ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం కూడా అనూహ్యంగా ఏర్పాటైనదేనని తెలిసింది. అంతకంటే ముఖ్యంగా ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఇప్పుడు ఇదే అన్ని పార్టీల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటక ఎన్నికల తరువాత ఎపిలోని టిడిపి ప్రభుత్వం పై చర్యలు ఉంటాయని బిజెపి నేతలు అంతకుముందే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జరుగుతున్న తాజా పరిణామాలు సర్వత్రా ఉత్కంఠను రేపుతున్నాయి.
టిడిపి...ఎందుకు కలవరం?
టిడిపి ఈ సమావేశాన్ని చాలా తీవ్రంగా పరిగణించినట్లు ఆ పార్టీ నేతల ప్రతి స్పందనను బట్టి అర్థం అవుతోంది. కారణం అసలే అవకాశం కోసం కాసుకు కూర్చున్న బిజెపి తో ఒక వైసిపి ఎమ్మెల్యే...అదీ పీఏసీ ఛైర్మన్ అయిన బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి భేటీ కావడంపై టిడిపి కీడు శంకిస్తోంది. కారణం ఎపి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ గా బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి దగ్గర రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన అన్ని లావాదేవీలకు సంబంధించిన ఫైళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. దానికి తోడు ఈ సమావేశానికి ముందు...తరువాత చోటుచేసుకున్న మరికొన్ని పరిణామాలు కూడా టిడిపి ముఖ్యులను కలవరపాటుకు గురిచేసినట్లు తెలిసింది.
మరికొన్ని పరిణామాలు...ఇవే
మరోవైపు తెలంగాణా సీఎం కేసీఆర్ ప్రధాని మోడీతో శుక్రవారం మధ్యాహ్నం సమావేశం కానున్నారు. ఈ భేటీ కోసం గురువారమే కెసిఆర్ ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణా రాష్ట్రంలో కొత్త జోన్ల ఏర్పాటుపై ఆయన ప్రధానంగా ప్రధానితో చర్చిస్తారని అంటున్నారు. అయితే ఈ సమావేశానికి ఇతర రాజకీయ ప్రాధాన్యత కూడా ఉందని...అది ఎపితో ముడిపడి ఉన్న మరి కొన్ని పరిణామాల గురించి కూడా కావచ్చొని మరో ప్రచారం సాగుతోంది. అంతకుముందు తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులుతో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమావేశమయ్యారు. చంద్రబాబును గద్దెదించేందుకు వైసీపీ, పవన్లకు సంఘీభావం ప్రకటిస్తానని మోత్కుపల్లి ప్రకటించగా...చంద్రబాబును వ్యతిరేకించే వారెవరికైనా తమ మద్దతు ఉంటుందని, పవన్కూ ఇలాంటి మద్దతు అందిస్తామని సాయిరెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు ఇటీవలే ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావుతో సమావేశం కూడా దీనికి సంబంధం ఉందనేది మరో టాక్.
టిడిపి...ప్రతి స్పందనేంటి?
అయితే ఈ సమావేశం ఎందుకు జరిగిందనేది టిడిపికి ఖచ్చితంగా సమాచారం అందలేదని, ఆ మేరకు బిజెపి ముఖ్య నేతలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని తెలిసింది. బిజెపి ఇంత హఠాత్తుగా ఎపి భాజపా నేతలతో, వైసిపి నేత...పిఎసి ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డితో సమావేశం కావడం...ఆ భేటీ జరిగిన విషయం లీక్ కావడంతో...ఈ భేటీ ప్రాధాన్యతను పసిగట్టిన టిడిపి హై అలెర్ట్ అయింది. ఆ విషయంపై వ్యూహాత్మకంగా స్పందిస్తూ వైసిపి ఎమ్మెల్యే బిజెపి నేతలతో సమావేశం కావడం బీజేపీతో జగన్ అంటకాగుతున్నారనడానికి నిదర్శనమని అన్నారు. జగన్ దొంగపనులు చేశారు కాబట్టే బీజేపీకి లొంగిపోయారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
శుక్రవారం...టిడిపి కీలక సమావేశం
మరోవైపు ఈ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం టీడీపీ కీలకసమావేశం జరగనుంది. ఈ సమావేశం కూడా కేంద్రంతో ఎపి ప్రభుత్వానికి ముడిపడి ఉన్న అంశాలపై చర్చించేందుకే కావడం గమనార్హం. అలాగని టిడిపినే స్పష్టం చేసింది. బిజెపి ముఖ్యులతో వైసిపి ఎమ్మెల్యే బుగ్గన సమావేశం తరువాత ఈ సమావేశానికి ఈ సమావేశానికి రావాలని ముందుగా ఆహ్వానించిన నేతలతో పాటు మరి కొంతమంది పార్టీ ముఖ్యులను హాజరుకావాల్సిందిగా టిడిపి అధిష్టానం నుంచి పిలుపులు వెళ్లినట్లు సమాచారం. అయితే స్టీల్ప్లాంట్పై కేంద్రం వైఖరి, నీతి ఆయోగ్ తో పాటు వైసీపీ, బీజేపీ నేతల భేటీ, చంద్రబాబు ఢిల్లీ పర్యటన అంశాలపై కూడా చర్చిస్తారని సమాచారం.
చంద్రబాబు ఢిల్లీకి...ఎందుకంటే?
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఈ నెల 17వ తేదీన ఢిల్లీ వెళ్తున్నారు. నిజానికి ఈ సమావేశాన్ని 16న నిర్వహించాలని నిర్ణయించారు. రంజాన్ దృష్ట్యా తాను పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున భేటీని ఈ నెల 18వ తేదీకి గానీ, కనీసం 17వ తేదీ మధ్యాహ్నానికి గానీ మార్చాలని చంద్రబాబు నీతి ఆయోగ్ వైస్చైర్మన్ రాజీవ్కుమార్కు లేఖ రాశారు. దాంతో సమావేశాన్ని 17న జరుపుతున్నట్లు రాజీవ్ గురువారం ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబు ఈ నెల 17న ఢిల్లీలో ఉంటారు. అయితే తాజా పరిణామాల నేపత్యంలో చంద్రబాబు కేంద్రంలో తనకు అండగా ఉండే పెద్దలతో సమావేశమై కీలక చర్చలు జరపడం ఖాయంగా కనిపిస్తోంది.
వైసిపికి దెబ్బే:అయినా...ఓకే!
ఢిల్లీలో బిజెపి నేతలతో వైసిపి ఎమ్మెల్యే, పిఎసి పిఎసి ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సమావేశం కావడంపై అవకాశంగా తీసుకొని బిజెపి-వైసిపి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని,అందుకు ఇదే నిదర్శనమని టిడిపి బలంగా ప్రచారం చేస్తుందని...రాజకీయంగా అది తమకు మైనస్ అని వైసిపికి తెలుసు...టిడిపి అక్షరాలా అదే చేస్తోంది కూడా!...అయినా సరే వైసిపి వెనక్కి తగ్గడం లేదు. దీన్నిబట్టి చంద్రబాబును చిక్కుల్లో పడేసేందుకు వైసిపి రాజకీయంగా జరిగే నష్టాన్నయినా ఎదుర్కొనేందుకు సంసిద్దమైనట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది. టిడిపి ప్రతిస్పందన అదే విషయాన్ని నిర్ధారిస్తోంది. వీటన్నింటి బట్టి అతి త్వరలోనే ఎపికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకోవడం ఖాయమంటున్నారు. అలా జరుగుతుందా?...అదేం లేదంటారా?...సో...వెయిట్ అండ్ సీ...