మోడీ గుస్సా: కేబినెట్ నుంచి సుజనా ఔట్, గరికపాటి ఇన్?
హైదరాబాద్: విదేశీ బ్యాంకు నుంచి అప్పు తీసుకుని దానిని చెల్లించకుండా మోసం చేశారనే అభియోగం ఎదుర్కొంటున్న కేంద్రమంది సుజనా చౌదరిపై ప్రధాని నరేంద్ర మోడీ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఏమాత్రం లేదని, ప్రధాని కూడా సుజనా చౌదరి విషయంలో అసంతృప్తితో ఉన్నారని ఢిల్లీ పార్టీ వర్గాల సమాచారం.
ఆ మేరకు సుజనా స్థానంలో మరొకరి పేరు సూచించాల్సిందిగా పిఎంఓ వర్గాలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి స్పష్టమైన సంకేతాలు పంపినట్లు ప్రచారం సాగుతోంది. దాంతో సుజనా స్థానంలో సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడయిన గరికపాటి మోహన్ రావుకు కేంద్రమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.
సుజనా చౌదరి రాజీనామా చేయాలని, బ్యాంకులను మోసం చేసిన వారిని నిజాయితీపరుడని చెప్పుకునే మోడీ ఎలా కొనసాగిస్తున్నారని, ఆయనను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేసింది. ఇటు రాష్ట్రంలో కూడా వైయస్సార్ కాంగ్రెస్, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు కూడా సుజన వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని టిడిపి-బిజెపి నాయకత్వాలపై ఆరోపణలు చేస్తున్నాయి.
దాన్ని టిడిపి నాయకత్వం తేలిగ్గా తీసుకున్నప్పటికీ బిజెపి మాత్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రధాని మోడీ కూడా ఈ వ్యవహారంలో చౌదరిపై అసంతృప్తితోనే ఉన్నారని, చౌదరిని కొనసాగిస్తే విపక్షాలు చేసిన ఆరోపణలు నిజమని భావించాల్సి ఉంటుందని, టిడిపి నాయకత్వానికి స్పష్టం చేసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఆ క్రమంలో తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్రావును మంత్రి పదవి వరించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అయితే, గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి చేరిన ఎంపి జెసి దివాకర్రెడ్డి కూడా తనకు కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు సమాచారం. అయితే, గరికపాటికి కేంద్రమంత్రి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణలో పార్టీని బతికించుకోవచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు.