ఈ కష్టం పగవాడిక్కూడా వద్దు..!!
హైదరాబాద్: ప్రముఖ నటుడు, టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఆయన వయస్సు 79 సంవత్సరాలు. కార్డియాక్ అరెస్ట్తో సోమవారం తెల్లవారు జామున హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. కార్డియాక్ అరెస్ట్కు గురై అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.

పెద్ద కుటుంబం..
కృష్ణకు ఇద్దరు భార్యలు. ఇందిరా దేవి, విజయనిర్మల. 2019లో విజయనిర్మల కన్నుమూశారు. ఇందిరా దేవి ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఇద్దరు కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబు, కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. రమేష్ బాబు ఈ ఏడాది జనవరి 8వ తేదీన అనారోగ్యంతో మరణించారు.

ఫలించని పూజలు..
తమ ఆరాధ్య నటుడు సూపర్ స్టార్ కృష్ణ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని డిశ్చార్జ్ అవుతారని అభిమానులు ఆశించారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలంటూ ఆలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. కొన్ని చోట్ల హోమం సైతం నిర్వహించారు. అవేవీ ఫలించలేదు. కోట్లాదిమంది అభిమానులు శోకసముద్రంలో ముంచుతూ ఈ తెల్లవారు జామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే కృష్ణ కుటుంబ సభ్యులు కాంటినెంటల్ ఆసుపత్రికి చేరుకున్నారు.

ఈ ఏడాది తీరని విషాదం..
తండ్రి మరణంతో మహేష్ బాబు ఒంటరివాడయ్యారు. 2022 సంవత్సరం ఆయన జీవితంలో తీరని విషాదాన్ని మిగిల్చినట్టయింది. ఈ ఏడాది జనవరి 8వ తేదీన అన్న రమేష్ బాబు మరణించారు. అదే సమయంలో మహేష్ బాబు కరోనా వైరస్ బారిన పడ్డారు. క్వారంటైన్లో గడిపారు. రమేష్ బాబు అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయాడు. సరిగ్గా ఎనిమిది నెలల్లో తల్లిని కోల్పోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వీల్చైర్కే పరిమితమైన తల్లి ఇందిరా దేవి ఈ సెప్టెంబర్ 28వ తేదీన మృతిచెందారు.

తల్లి మరణించిన బాధ నుంచి కోలుకుంటోండగానే..
తల్లి మరణించిన బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్నారు మహేష్ బాబు. తల్లి అస్తికలను ఇటీవలే వారణాశిలో గంగానదిలో నిమజ్జనం చేసి వచ్చారు. సరిగ్గా నెలన్నర రోజుల్లో- కొండంత అండగా ఉంటూ వచ్చిన తండ్రి కృష్ణను కూడా కోల్పోవాల్సి వచ్చింది. తన కుటుంబంలో ఒకే ఏడాది ముగ్గురిని కోల్పోవాల్సి రావడం సాధారణ విషయం కాదు. తొలుత అన్న, తరువాత అమ్మ, ఇప్పుడు నాన్నను కోల్పోవడంతో ఒంటరివాడయ్యాడు.

స్టే స్ట్రాంగ్..
మహేష్ బాబు కుటుంబంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు అటు ఆయన అభిమానులను కూడా కలచి వేసేలా చేస్తోంది. ఆయన పరిస్థితి తలచుకుని ఆవేదనకు గురవుతోన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై #MaheshBabu, #StaystrongMaheshAnna అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మహేష్ బాబుకు అండగా కోట్లాదిమంది అభిమానులు ఉన్నారని, ఆయన ఒంటరివాడు కాదని ధైర్యం చెబుతోన్నారు.












Click it and Unblock the Notifications