అమరావతి పిటిషన్లపై సుప్రీం కీలక నిర్ణయం.. ఎన్నికల ముందు మరింత హీట్ ?
ఏపీలో అమరావతి రాజధాని వర్సెస్ మూడు రాజధానుల వ్యవహారంలో సుప్రీంకోర్టులో వందకు పైగా పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. వీటిపై ఇప్పటికే ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం తన వాదనతో అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై ఇవాళ విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ తన వాదన వినిపించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుది.

అమరావతి రాజధాని స్ధానంలో వైసీపీ సర్కార్ మూడు రాజధానుల్ని ప్రతిపాదించి ముందుకెళ్తున్న క్రమంలో రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సీఆర్డీయే చట్టం ప్రకారం అమరావతినే రాజధానిగా నిర్ధారిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రైతుల్లో అనందం నింపగా.. ప్రభుత్వానికి మంటపుట్టించింది. దీంతో ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత రైతులు కూడా హైకోర్టు తీర్పు యథాతథంగా అమలు చేయాలంటూ సుప్రీంను ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో రాజధాని పిటిషన్లపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం రెగ్యులర్ విచారణ మాత్రం జరపట్లేదు. అయితే సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన నోటీసులకు స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లపై ఇవాళ మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో పాటు అమరావతి పిటిషన్లపై రెగ్యులర్ విచారణను ఈ ఏడాది డిసెంబర్ కు వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అమరావతి పిటిషన్ల విచారణ మరింత ఆలస్యం కాబోతోంది.
ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా న్యాయమూర్తులు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్ ను లీడ్ మ్యాటర్ గా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు. అయితే డిసెంబర్ లోపు విచారణకు తేదీలు కుదరనందున అప్పటివరకూ వాయిదా వేయక తప్పడం లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో రాజధాని కేసుల విచారణ డిసెంబర్ వరకూ జరిగే అవకాశం లేదు. ఆలోపు యథాతథ పరిస్దితులు కొనసాగబోతున్నాయి.












Click it and Unblock the Notifications