పవన్ కల్యాణ్ పోటీ సీటు ఖరారు : చంద్రబాబు- లోకేష్ స్థానాల ఎఫెక్ట్..!?
ఏపీలో ఎన్నికల సమరం ప్రారంభమైంది. పార్టీల అధినేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. పొత్తులు..సీట్ల లెక్కలు ఖరరావుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్..టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పోటీ చేసే స్థానాలు ఖరారయ్యాయి. మరి..జనసేనాని పవన్ ఎక్కడి నుంచి పోటీకి దిగుతున్నారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది సస్పెన్స్ అని మెగా బ్రదర్ నాగబాబు చెప్పుకొచ్చారు. టీడీపీతో పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ..పవన్ పోటీ స్థానం పైన రాజకీయంగా ఆసక్తి కనిపిస్తోంది. వైసీపీ నేతలు కూడా పవన్ పోటీ చేసే నియోజకవర్గం ఖరారు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ నేతలు కొత్త వాదన తెర మీదకు తెచ్చారు. పవన్ సీటు ఖరారు పైన భిన్నాభిప్రాయాలు..కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.

టీడీపీతో పొత్తు- పవన్ సీటు పై కొత్త లెక్కలు..
2019 ఎన్నికల్లో తొలిసారి పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. ఈ సారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలనేది పవన్ లక్ష్యం. ఇందుకోసం ఇప్పటికే ఎంపిక చేసిన అసెంబ్లీ సీట్లలో సర్వే కూడా చేయించినట్లు సమాచారం. పవన్ గతంలో పోటీ చేసిన రెండు స్థానాల్లో గాజువాక, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం, పశ్చిమ గోదావరి జిల్లా లో పాలకొల్లు, తిరుపతి, అనంతపురం స్థానాల్లో ఈ సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో టీడీపీతో పొత్తు తో ఎన్నికల్లోకి దిగితే..రాయలసీమ నుంచి చంద్రబాబు, బాలయ్య పోటీ చేస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి లోకేష్ బరిలో నిలుస్తున్నారు. దీంతో..పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర నుంచే పోటీ ఖాయంగా కనిపిస్తోంది. అందులో భాగంగా విశాఖ నుంచే పవన్ పోటీ చేయటం ఖాయమని సమాచారం. దీంతో, గాజువాక నుంచే పవన్ తిరిగి పోటీ చేస్తారని పార్టీ ముఖ్య నేతల సమాచారం. ఇప్పటికే విశాఖ కేంద్రంగా జనసేన ఫోకస్ పెట్టింది.

ఒక స్థానమా.. రెండు చోట్ల పోటీ చేస్తారా
సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయంతో ముందుకు వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర - రాయలసీమ లో టీడీపీని దెబ్బ తీయాలని జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. దీంతో..ఆ రెండు రీజియన్ల నుంచి పవన్ పోటీ చేస్తే ఆ జిల్లాల్లో కలిసి వస్తుందని లెక్కలు వేస్తున్నారు. దీంతో..ఉత్తరాంధ్రలోని గాజువాక తో పాటుగా రాయలసీమలో తిరుపతి లేదా అనంతపురం నుంచి పవన్ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పవన్ అనంతపురం నుంచి పోటీ చేస్తే తమ భుజాల మీద మోసి గెలిపించుకుంటామని స్థానిక టీడీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ మాత్రం పవన్ ను కర్నూలు జిల్లా నుంచి పోటీ చేయమని సూచించే అవకాశం ఉందని చెబుతున్నారు. 2009లో చిరంజీవి రెండు స్థానాల్లో పోటీ చేసి పాలకొల్లులో ఓడిపోగా, తిరుపతిలో గెలుపొందారు. మెగా బ్రదర్స్ సొంత జిల్లాలో గెలవలేదనే ప్రచారానికి ఈ సారి విజయంతో ముగింపు పలకాలనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. దీంతో..పాలకొల్లు కూడా పరిశీలనలో ఉంది. పవన్ అసలు ఒక స్థానం నుంచి బరిలో ఉంటారా..రెండు సీట్లలో పోటీ చేస్తారా అనే దానికి అనుగుణంగా తుది నిర్ణయం ఉంటుంది.

చంద్రబాబు- లోకేష్ స్థానాల ఎఫెక్ట్..
పవన్ కల్యాణ్ పోటీ పైన వైసీపీ నేతలు కొత్త వాదన వినిపిస్తున్నారు. చంద్రబాబు - లోకేష్ పోటీ చేస్తున్న కుప్పం- మంగళగిరి పైన ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఆ రెండు నియోకవర్గాల్లో కొత్త సామాజిక సమీకరణాలను అమలు చేస్తున్నారు. ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. టీడీపీ నేతలను వైసీపీలోకి ఆకర్షిస్తున్నారు. మంత్రులు..సీనియర్లకు ఆ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. దీంతో.. ఇప్పుడు ఆ ఇద్దరి కంటే ఒక విధంగా పవన్ పైన ఇప్పుడు వైసీపీ గురి పెట్టింది. పవన్ తన సీటు ముందుగా ప్రకటిస్తే కుప్పం - మంగళగిరి తరహాలోనే ఆ నియోజకవర్గంలోనూ వైసీపీ ఆపరేషన్ ప్రారంభించటం ఖాయమని చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు పవన్ తాను పోటీ చేసే నియోజకవర్గం పైన సస్పెన్స్ పైన క్లారిటీ ఇస్తారా..ఎన్నికల వరకు ఇలాగే కొనసాగిస్తారా అనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications