స్వీట్ రివెంజ్..! టీడిపి కోటగోడలు కూల్చడంలో తనవంతు సహకారం అందించిన గబ్బర్ సింగ్..!!
అమరావతి/హైదరాబాద్ : తాను గెలిచినా.. గెలవక పోయినా.. టీడిపీ నేతల గెలుపు పై మాత్రం ప్రభావం చూపిస్తాను.. రెండుశాతం ఓట్లంటూ ఎగతాళి చేసిన తెలుగుదేశం పార్టీ నేతలకు జనసేనాని పవన్కళ్యాణ్ విసిరిన సవాల్ అది. తాను ఓడినా.. వారిని మాత్రం గెలవనీయనంటూ చేసిన సవాల్ ని పవన్ నిలబెట్టుకున్నారు. 2019 ఎన్నికల ఫలితాల్లో అది నిర్దారణ కూడా అయ్యింది. పవన్ ఆ మాటలు యాదృచ్ఛికంగా అన్నారో, లేకపోతే.. ప్రతీకారం తీర్చుకోవాలని స్పందించారో గానీ.. ఇప్పుడు అవే వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.
టీడిపి పై కసి తీర్చుకున్న పవన్..! ఘోరంగా ఓడిపోయిన అభ్యర్థులు..!!
ఏపీలో ఘోర ఓటమిని జీర్ణించుకోలేని టీడిపి నేతలు.. తమ పరాజయాన్ని ఎవరిమీదో నెట్టాలని చూసి, చివరకు జనసేన అదినేత పవన్ కళ్యాణ్ మీదకు నెట్టేసి ఊపిరి పీల్చుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో జతకట్టిన తెదేపా కాపు ఓట్ల కోసం పవన్ను అర్జించింది. భాజపా ద్వారా ఒత్తిడి తెచ్చి పవన్తో ప్రచారం చేయించుకున్నారు. వైసీపీ గెలుపు గ్యారంటీ అనుకున్న సమయంలో పవన్ రాకతో చంద్రబాబు సీఎం కాగలిగారు. ముఖ్యంగా కోస్తా, ఉభయగోదావరి జిల్లాల్లో కాపులు చంద్రబాబు హామీలు, కాపు రిజర్వేషన్, పవన్ ప్రచారానికి కట్టుబడి ఓట్లేసి బాబును గెలిపించారు.
2014లో టీడిపి గెలుపులో పవన్ కీలక పాత్ర..! కానీ పవన్ ను దూషించిన తెలుగు తమ్ముళ్లు..!!
అయితే.. జన్మభూమి కమిటీల్లో అక్రమాలు, రాష్ట్రంలో పెరుగుతున్న అవినీతి, లోకేష్ పిల్ల చేష్టలపై పవన్ ప్రశ్నించటంతో తెలుగుదేశం నేతలు జీర్ణించుకోలేకపోయారు. పవన్ వల్ల తాము గెలవలేదంటూ.. నోరుజారారు. చింతమనేని, కేశినేని, జేసీ దివాకర్రెడ్డి వంటి నేతలు.. పవన్కు తన అన్న చిరంజీవిని గెలిపించే శక్తి లేదు.. తమనేం గెలిపించాడంటూ ఎద్దేవాచేశారు. పైగా ఆయన వల్ల తమకు మరిన్ని సీట్లు పోగొట్టుకున్నామంటూ ఎదురుదాడి చేశారు.
పవన్ పై టీడిపి నేతల విసుర్లు కసుర్లు..! విడిపోయిన మైత్రీ బంధం..!!
2 శాతం ఓట్లతో పవన్ తెదేపాను గెలిపించాననటంపై దారుణంగా మాట్లాడారు. ఇవన్నీ పవన్లో మరింత ఉక్రోశాన్ని పెంచాయి. తన వల్ల గెలిచిన సీట్లలోని నేతలు కూడా ఇలా స్పందించటాన్ని సహించలేక లేకపోయారు. అందుకే.. ఒంటరిగా బరిలోకి దిగారు. టీడిపి ఓటు బ్యాంకును దెబ్బతీసేందుకు పక్కాగా వెళ్లారు. అయితే టీడీపీ మాత్రం తమను సంక్షేమ పథకాలు, జనసేన చీల్చే వైసీపీ ఓట్లు గెలిపిస్తాయని అంచనాలు వేసుకున్నారు. తీరా.. ఎన్నికల ఫలితాల వెలువడ్డాక.. సుమారు 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం జనసేన అభ్యర్థుల వల్ల టీడీపీ అభ్యర్థులు ఘోరంగా ఓటమి చవిచూసినట్లు నిర్ధరించుకున్నారు.
టీడిపి ఘోర పరాజయం..! జనసేన వల్ల ఓడియామంటున్న నేతలు..!!
5-6 పార్లమెంటరీ స్థానాల్లోనూ జనసేన బాగా దెబ్బతీసిందని, ఇవన్నీ పవన్ కళ్యాణ్ కావాలని చేయకపోయినా.. తన ఓటమితోపాటు.. టీడీపీ ఉనికిని ప్రశ్నార్ధకంగా చేశాయని మాత్రం విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో.. 2009లో చిరంజీవి, 2019లో పవన్ కళ్యాణ్ టీడీపీ గెలుపును అడ్డుకున్నారంటూ విమర్శలకు దిగుతున్నారు. సోషల్మీడియాలో అయితే కాపు ఓటర్లు, పవన్ కళ్యాణ్ పై దారుణంగా స్పందిస్తున్నారు. అంతే కాకుండా అదికారంలోకి రాకుడా చేసి తెలుగుదేశం పైన స్వీట్ రివెంజ్ తీర్చుకున్నరని చెప్పుకొస్తున్నారు.