అదే అజెండా: రాప్తాడులో పరిటాలను టార్గెట్ చేస్తూ జగన్, దేనికైనా సిద్ధమని ప్రకాశ్ రెడ్డి
అనంతపురం: ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పునరుద్ఘాటించారు. అనంతపురంలో పాదయాత్ర చేస్తున్న ఆయన్ను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు కలిశారు.
Recommended Video

ఈ నెల తాము ప్రత్యేక హోదా కోసం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దానికి మద్దతివ్వాలని కోరారు. దానికి జగన్ పైవిధంగా సంధించారు. గురువారం ఉదయం 8.30కు రాప్తాడు నియోజకవర్గం గంగులకుంట శివార్ల నుంచి ఆయన తన 35వ రోజు పాదయాత్రను ఆయన ప్రారంభించారు.

పాదయాత్ర, విరామం
మధ్యాహ్నం 12.30 వరకు కందుకూరు మీదుగా ధర్మవరం నియోజకవర్గం చిగిచర్ల శివారు వరకు 11.3 కి.మీ. నడిచారు. అనంతరం పాదయాత్రకు విరామమిచ్చి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యేందుకు హైదరాబాద్ బయలుదేరారు.

జగన్ను కలిసిన ప్రజలు
పాడికి ప్రసిద్ధి గాంచిన కందుకూరులో పశుక్రాంతి పథకం అమలు కాకపోవడంతో కొత్తగా బర్రెలను ఇవ్వడం లేదని పలువురు మహిళలు జగన్ దృష్టికి తీసుకు వచ్చారు. ఎఫ్సీఐ గోదాముకు చెందిన కూలీలు ఆయనను కలిశారు. మూడేళ్ల నుంచి గోదాము మూసేయడంతో సుమారు 500 మంది ఉపాధి కోల్పోయామని తెలిపారు. అధికారంలోకి వస్తే వారికి న్యాయం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.

ప్రత్యేక హోదా ప్రధాన అజెండాగా
ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జగన్ విమర్శించారు. పార్లమెంట్లో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధాన అజెండాగా తమ ఎంపీలు ప్రస్తావిస్తారని ఎస్కేయూ విద్యార్థులకు జగన్ వివరించారు.

పరిటాల సునీతపై జగన్, ప్రకాశ్ రెడ్డి
పరిటాల సునీత తన నియోజకవర్గానికి ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని జగన్ మండిపడ్డారు. రాప్తాడు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ను ముఖ్యమంత్రిగా చేసేందుకు తాను దేన్నైనా త్యాగం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. వైసీపీ నేతలు రాప్తాడులో ఫ్యాక్షన్ రాజకీయాల గురించి మాట్లాడుతూ పరిటాల కుటుంబాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications