Raghurama: రఘురామకు ఆ టికెట్ ఖరారు చేసిన చంద్రబాబు..!
ఈ మధ్యే వైసీపీకి రాజీనామా చేసి నిన్న టీడీపీలో చేరిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఎట్టకేలకు చంద్రబాబు టికెట్ ఖరారు చేశారు.
వైసీపీ నుంచి గెలిచి ఆ పార్టీపై నాలుగేళ్లుగా పోరాటం చేసిన రఘురామ ఆ తర్వాత ఏ పార్టీలో చేరకపోవడంతో ఎన్డీయే కూటమిలో పార్టీలు ఆయన్ను పట్టించుకోకుండానే టికెట్లు ఖరారు చేసేశాయి. దీంతో నరసాపురం ఎంపీ లేదా మరేదైనా టికెట్ ఎలాగైనా దక్కించుకోవాలన్న పట్టుదలతో కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్న రఘురామకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు.

ఎన్డీయే టికెట్ల కేటాయింపుల్లో ఏ సీటూ దక్కకపోవడంతో రఘురామ రాజు టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లి సంప్రదింపులు జరిపారు. అనంతరం బీజేపీ పెద్దలతో చర్చించిన చంద్రబాబుకు నరసాపురం లోక్ సభ సీటుపై ఎలాంటి హామీ లభించలేదు. దీంతో ప్రత్యామ్నాయంగా పెట్టుకున్న ఉండి అసెంబ్లీ సీటును రఘురామకృష్ణంరాజుకు కేటాయిస్తూ చంద్రబాబు ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పాలకొల్లులో జరిగిన పార్టీ భేటీలో నిర్ణయం ప్రకటించారు.
చంద్రబాబు ప్రకటనతో రఘురామకృష్ణంరాజు వర్గం సంతోషంలో మునిగిపోయింది. టీడీపీకి గట్టి పట్టున్న ఉండి అసెంబ్లీ సీటులో పోటీ రఘురామకు కలిసి వస్తుందని ఆయన అనుచరులు అంచనా వేసుకుంటున్నారు. మరోవైపు చంద్రబాబు ప్రకటన తర్వాత ఇప్పటికే ఉండి టికెట్ కేటాయించిన సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు అనుచరులు ఆందోళనకు దిగారు. రామరాజుకు చంద్రబాబు రెండేళ్ల క్రితం ఇచ్చిన టికెట్ హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications