బిజెపితో పొత్తు కుదిరింది, ఇబ్బంది రావొచ్చుకానీ: బాబు
హైదరాబాద్: తెలుగుదేశం, బిజెపిల మధ్య పొత్తు కుదిరిందని ఆ పార్టీలు ఆదివారం ప్రకటించాయి. ఏఏ నియోజకవర్గాలనే విషయమై రెండు మూడు రోజుల్లో చెబుతామని వారు తెలిపారు. మధ్యాహ్నం బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఇరు పార్టీలకు చెందిన పలువురు నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. బిజెపికి సీమాంధ్రలో 15 అసెంబ్లీ, 5 లోకసభ స్థానాలు, తెలంగాణలో 47 అసెంబ్లీ, 8 లోకసభ స్థానాలు కేటాయించామని చెప్పారు. పొత్తుల వల్ల పార్టీలో కొందరికి ఇబ్బందులు రావొచ్చునని కానీ, కార్యకర్తలు నేతలు అర్థం చేసుకోవాలని బాబు సూచించారు. కాంగ్రెసు పార్టీని ఓడించేందుకే పొత్తులు అనే విషయం గుర్తించాలని కోరారు.
బిజెపితో కలిసి కాంగ్రెసు పార్టీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. దేశ ప్రయోజనాల కోసమే బిజెపితో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. అవినీతి, కుంభకోణాలతో దేశాన్ని కాంగ్రెసు పార్టీ అస్తవ్యస్తం చేసిందన్నారు. ఎన్నికల్లో టిడిపి, బిజెపి కార్యకర్తలు కలిసి పని చేయాలన్నారు. ఎన్డీయే కూటమి 300 స్థాన పార్లమెంటు స్థానాలు గెలుస్తుందని, అందరికీ తర్వాత న్యాయం చేస్తామన్నారు.
పొత్తువల్ల నష్టపోయే న్యాయం చేస్తామన్నారు. దేశంలో కాంగ్రెసు పార్టీని పూర్తిగా పాతిపెట్టాలన్నారు. కాంగ్రెసు హయాంలో అభివృద్ధి తగ్గి అవినీతి పెరిగిందన్నారు. పొత్తుల వల్ల ఎన్నికల్లో లాభ నష్టాలు సహజమన్నారు. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామన్నారు. దేశ ప్రజలు మోడీ వైపు చూస్తున్నారన్నారు. బిజెపి, టిడిపిల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేదన్నారు. అవినీతిరహిత దేశం బిజెపి, టిడిపి వల్లే సాధ్యమన్నారు.
272 లక్ష్యం: జవదేకర్
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 272 సీట్లు సాధించడమే తమ లక్ష్యమని ప్రకాశ్ జవదేకర్ అన్నారు. కొద్ది రోజులుగా పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని, ఇప్పుడు పొత్తు కుదిరిందన్నారు. చంద్రబాబుతో తమ పార్టీ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీలు మాట్లాడారన్నారు. రెండు రాష్ట్రాల్లోను పొత్తులు ఉంటాయని, టిడిపి ఎన్డీయేలో భాగస్వామి అని నరేష్ గుజ్రాల్ అన్నారు.