ఎన్నికల ముందు దాడులు బీజేపీకి అలవాటు:చంద్రబాబు;వాటితో మాకు సంబంధం లేదు:భాజపా ఎంపి జివిఎల్
అమరావతి:ఎపిలో ఐటీ దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి.ఈ దాడులపై స్పందించిన సిఎం చంద్రబాబు టీడీపీ ముఖ్య నేతలతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు రాష్ట్రాల్లో ఐటీ, ఈడీ దాడులు చేయటం బీజేపీకి అలవాటైపోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
దాడుల నేపధ్యంలో టిడిపి నేతలందరూ అప్రమత్తంగా ఉండాలని సిఎం చంద్రబాబు సూచించినట్లు తెలిసింది. ఎటువంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు సిద్థంగా ఉన్నామని...రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తామని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇదిలావుంటే ఏపీ రాష్ట్రంలోని టీడీపీ నాయకులకు చెందిన సంస్థలపై ఐటి దాడుల వెనుక తమ నేతల హస్తం లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు స్పష్టం చేశారు.
ఐటి దాడులు...సంచలనం
విజయవాడలో శుక్రవారం ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో సాగుతున్న ఐటి సోదాల్లో ఆ శాఖ అధికారులు కీలకమైన సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. సదరన్ డెవలపర్స్ ఆఫీసులో జరిపిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.ఈ డాక్యుమెంట్లు ఓ మంత్రికి సంబంధించినవిగా చెప్పుకుంటున్నారు. సదరన్ డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ పేరుతో ఒక సంస్థ అమరావతిలో భూ లావాదేవీలు జరిపినట్లు ఐటీ శాఖ గుర్తించిందని సమాచారం.
మోడీ...కక్ష సాధింపు
ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలపై మోదీ ప్రభుత్వం కక్షసాధిస్తోందని ఆరోపించారు. బీదా మస్తాన్రావు సంస్థలపై ఐటీ దాడులు కుట్రపూరితమే అని మండిపడ్డారు. తమిళనాడు, కర్ణాటకలో మాదిరిగా ఏపీపై కూడా పెత్తనం చేయాలని భావిస్తున్నారని మంత్రి నారాయణ బిజెపిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
టిడిపి ఆరోపణలు...జివిఎల్ ఖండన
అయితే ఐటి దాడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు, టిడిపి నేతల ఆరోపణలను బిజెపి ఎంపి జివిఎల్ ఖండించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని టీడీపీ నేతలకు చెందిన సంస్థలపై ఆదాయపు పన్ను శాఖాధికారుల దాడుల వెనుక తమ పార్టీ నేతల హస్తం లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తేల్చిచెప్పారు. అయినా ఐటీ దాడులకు తమకు సంబంధం ఎందుకు ఎలా ఉంటుందని జీవీఎల్ ప్రశ్నించారు. బీజేపీని అప్రతిష్టపాలు చేసేందుకే టీడీపీ నేతలు తమ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
బిజెపిలోకి...దించాలనే ఇలా
టిడిపి అవినీతి బురదలో కూరుకుపోయిందని... ఆ బురదలోకి బీజేపీని కూడ దించేందుకు టిడిపి నాయకులు ప్రయత్నం చేస్తున్నారని జివిఎల్ ఆరోపించారు. అందుకే ఐటీ అధికారులు తమ విధుల్లో భాగంగా దాడులు నిర్వహిస్తే ఆ దాడులను కూడ బీజేపీకి అంటగట్టి టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని జీవీఎల్ దుయ్యబట్టారు. ఏ విషయాన్నయినా రాజకీయం చేయడం టీడీపీ నేతలకు అలవాటేనని...ఆ క్రమంలోనే ఐటీ దాడుల విషయాన్ని కూడ రాజకీయంగా తమకు అనుకూలంగా టిడిపి నేతలు ఉపయోగించుకొంటున్నారని జివిఎల్ ధ్వజమెత్తారు.