కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలు: వైసీపీకి టిడిపి చెక్, బిజెపికి 9 సీట్లు
కాకినాడ: కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో బిజెపి, టిడిపిల మధ్య పొత్తు కుదిరింది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదురుతోందా లేదా అనే వాతావరంణం నెలకొంది. పోటాపోటీగా రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లను దాఖలుచేశారు.
కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల కోసం టిడిపి, బిజెపిల మధ్య ఎట్టకేలకు పొత్తు కుదిరింది. బిజెపికి 9 సీట్లను ఇచ్చేందుకు టిడిపి అంగీకరించింది. తొలుత ఈ కార్పోరేషన్లో 15 సీట్లు కావాలని బిజెపి పట్టుబట్టింది. అయితే 9 సాట్లకు మాత్రమే టిడిపి అంగీకరించింది.
39 వార్డుల్లో టిడిపి, 9 వార్డుల్లో బిజెపి అభ్యర్థులు పోటీచేయనున్నట్టు టిడిపి ప్రకటించింది. కాకినాడ అంబేద్కర్ భవన్ రోడ్డులో పార్టీ కార్యాలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప శుక్రవారం నాడు ప్రారంభించారు.
48 సీట్లకు గాను 493 మంది నామినేషన్లను దాఖలు చేశారు. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులకు మాత్రం రెబెల్స బెడద తప్పకపోవచ్చు. అయితే పార్టీ అధికారికంగా నిర్ణయించే అభ్యర్థులకే భి.ఫాంలను అందించనున్నారు.
టిడిపి,బిజెపిలకు చెందిన వారిలో రెబెల్స్గా నామినేషన్లు దాఖలు చేసినవారు తమ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకొంటారని ఏపీ డీప్యూటీ సీఎం చెప్పారు. కాకినాడ కార్పోరేషన్ను కైవసం చేసుకొంటామని డిప్యూటీ నిమ్మకాయల చిన రాజప్ప ప్రకటించారు.