కెసిఆర్కు భయపడి, జగన్ అండతో: మందకృష్ణ, ముద్రగడపై టిడిపి పావులు!
విజయవాడ: కాపులకు న్యాయం అంటూ ముద్రగడ పద్మనాభం, ఎస్సీ కేటగిరీ అంటూ మందకృష్ణ మాదిగ పెట్టిన డెడ్లైన్ల విషయంలో ప్రభుత్వం వారి పైన మరింత ఎదురు దాడికి దిగేందుకు సన్నద్ధమవుతోంది. ఇద్దరూ ఒకే డెడ్ లైన్ పెట్టారని, వారి వెనుక వైసిపి చీఫ్ జగన్ ఉన్నారని అవగతమవుతోందని టిడిపి నేతలు చెబుతున్నారు.
ముద్రగడ, మందకృష్ణ.. ఇద్దరు కూడా ప్రభుత్వానికి ఈ నెల పదో తేదిన డెడ్ లైన్ పెట్టారు. ఇద్దరు ఒకే రోజున.. ఒకే డెడ్ లైన్ పెట్టారని టిడిపి నేతలు గుర్తు చేస్తున్నారు. వారి వెనుక జగన్ ఉన్నారని చెప్పేందుకు ఇదే నిదర్శనమని అంటున్నారు.
ముద్రగడపై...
ముద్రగడ దీక్ష చేసినప్పుడు ప్రభుత్వం హామీలు ఇచ్చిందని, అయినా ఆయన కోసం కాదని కాపుల అభ్యున్నతి కోసం తాను సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని టిడిపి నేతలు, సీఎం చంద్రబాబు చెబుతున్నారు.
ఆయన దీక్ష విరమించిన సమయంలో గడువు చెప్పారని, ఆ గడువుకు ముందే మరోసారి హెచ్చరించడాన్ని టిడిపి నేతలు గుర్తు చేస్తున్నారు. ఇదే విషయమై కాపు నాయకులను పిలిపించి, వారితో మాట్లాడాలని ప్రభుత్వం, టిడిపి నేతలు భావిస్తున్నారు.
తాజాగా, ముద్రగడ మరో డెడ్ లైన్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 10వ తేదీలోగా తన డిమాండ్లు పరిష్కరించకుంటే 11న దీక్షకు దిగుతానని చెప్పారు.
ఈ నేపథ్యంలో గత గడువు పూర్తి కాకముందే.. ఇలా మరోసారి ముద్రగడ హెచ్చరించడం వెనుక జగన్ ఉన్నారని, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కాపు నేతలకు వారు సూచించనున్నారని తెలుస్తోంది. అదే సమయంలో ఈసారి ముద్రగడ చేసే దీక్షను పట్టించుకోమని చెప్పారు.
మందకృష్ణపై...
మందకృష్ణ మాదిగ ఇటీవల ఏపీలో ఎస్సీ వర్గీకరణ కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీ డెడ్ లైన్ పెట్టారు. ఈ నేపథ్యంలో టిడిపి నేతలు ఎదురు దాడి ప్రారంభించారు. తెలంగాణలో అక్కడి సీఎం కెసిఆర్కు భయపడి అక్కడ ఎస్సీ రిజర్వేషన్ కోసం పట్టుబడటం లేదా అని ప్రశ్నిస్తున్నారు.
ఏపీలో తాము ఎస్సీలకు ఉపయోగపడే జీవోలు తెచ్చామని, తెలంగాణలో తేకుంటే ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదిగ.. విభజనకు మద్దతు పలికారని, అలాంటి వ్యక్తిని ఏపీలో తిరగనివ్వమని చెప్పిన సందర్భాలూ ఉన్నాయి.
మందకృష్ణను తిరగనివ్వం: శివాజీ
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగను ఏపీలో తిరగనివ్వమని మహానాడు అధ్యక్షులు కారెం శివాజీ అన్నారు. చంద్రబాబు ఎంగిలి మెతుకులు తిన్న మందకృష్ణకు తనను విమర్శఇంచే నైతిక హక్కు లేదన్నారు. మందకృష్ణను ప్రతిపక్ష నేత జగన్ మాలలపైకి వదలడం దురదృష్టకరమన్నారు.