వైసీపీ కంచుకోటపై చంద్రబాబు ఫోకస్ - కొత్త స్ట్రాటజీతో రంగంలోకి..!!
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. వైసీపీ కంచుకోటలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అందులో భాగంగా నేటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజులపాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి కర్నూలుకు చేరుకొని... అక్కడి నుంచి రోడ్డు మార్గాన సాయంత్రం 4గంటలకు పత్తికొండ ఎన్టీఆర్ సర్కిల్ రోడ్షో లో చంద్రబాబు పాల్గొంటారు.
అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రికి ఆదోనిలో బస చేస్తారు. 17న ఉదయం 11 గంటలకు రోడ్షో నిర్వహిస్తూ ఎమ్మిగనూరు చేరుకుంటారు. అక్కడ బహిరంగసభలో పాల్గొంటారు. 18న మధ్యాహ్నం కర్నూలు జిల్లా టీడీపీ ఆఫీసుకు వెళ్లి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 2019 ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోని రెండు లోక్ సభ స్థానాలతో పాటుగా 14 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఏకపక్షంగా విజయం సాధించింది. ఇదే సమయంలో కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధాని ఏర్పాటు దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకిస్తుంది. ఈ సమయంలో చంద్రబాబు కర్నూలు జిల్లాలోనే మూడు రోజుల పర్యటన ద్వారా, యువతతో పాటుగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోకవర్గాల వారీగా బాధ్యతలను ఖరారు చేయనున్నారు. అదే సమయంలో జిల్లాలో సీట్ల కేటాయింపు విషయంలోనూ చంద్రబాబు సంకేతాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. వచ్చే జనవరి నుంచి లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర ప్రారంభించనున్నారు.
ఇక, ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ తరువాత ఏపీలో పొత్తుల పైన కొత్త చర్చ మొదలైంది. టీడీపీ - జనసేన పొత్తు ఖాయమని భావిస్తున్న సమయంలో, ప్రధాని పర్యటన తరువాత సమీకరణాల్లో మార్పు కనిపిస్తోంది. వరుసగా రోడ్ షో లు - బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రసంగాలు ఉండటంతో, పొత్తుల పైన టీడీపీ అధినేత ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు.. ఏం చెప్పబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications