మూడేళ్ల తరువాత నారావారిపల్లికి- వచ్చే ఏడాది ఎన్నికలు మరి..!!
చిత్తూరు: రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఇవ్వాళ్టి నుంచే పాఠశాలలకు సెలవులు ఆరంభం అయ్యాయి. ఈ నెల 19వ తేదీ వరకు సెలవులే. సంక్రాంతి పండగను తమ సొంతూరిలో జరుపుకోవడానికి బయలుదేరి వెళ్లే వారితో బస్సులు, రైళ్లు ఫుల్ అవుతున్నాయి. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా హైదరాబాద్ సగం ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోంది. వందల సంఖ్యలో ప్రయాణికులు బస్సులు, రైళ్ల ద్వారా సొంతూర్లకు తరలి వెళ్తోన్నారు.

నారావారి పల్లికి..
ఇక తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి కుటుంబం కూడా తన సొంత ఊరికి చేరుకుంది. ఈ సాయంత్రం ఆయన కుటుంబం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంది. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెందిన నాయకులు ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. శాలువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

సాదర స్వాగతం..
చంద్రబాబు, నారా లోకేష్, ఆయన కుటుంబ సభ్యులను ఆహ్వానించడానికి పెద్ద ఎత్తున ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు ఎయిర్ పోర్టుకు వచ్చారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ పులవర్తి నాని, మాజీ శాసన సభ్యుడు జీ అశోక్.. వారి అనుచరులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి వచ్చారు. అనంతరం ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో నారావారి పల్లికి చేరుకున్నారు. నారావారి పల్లి గ్రామస్తులు చంద్రబాబు, నారా లోకేష్.. వారి కుటుంబాన్ని సాదరంగా స్వాగతం పలికారు.

మూడేళ్ల తరువాత..
మూడేళ్ల విరామం తరువాత చంద్రబాబు కుటుంబం నారావారి పల్లికి వెళ్లడం ఇదే తొలిసారి. 2014 నుంచి 2019 వరకు క్రమం తప్పకుండా చంద్రబాబు సంక్రాంతి పండగ సమయంలో తన సొంతూరికి వెళ్లే సంప్రదాయాన్ని పాటించిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు ఆయన అక్కడ తన బంధుమిత్రులతో కలిసి నారావారిపల్లిలో సంక్రాంతి వేడుకలను జరుపుకొనే వారు.

2019 తరువాత..
2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తరువాత- సంక్రాంతి నాడు సొంత ఊరికి వెళ్లే సంప్రదాయానికి పుల్ స్టాప్ పెట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితులు కూడా దీనికి ఓ కారణం అయ్యాయి. ఇప్పుడా పరిస్థితులు లేకపోవడంతో మళ్లీ ఆ సంప్రదాయాన్ని పునరుద్ధరించారాయన. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయన మళ్లీ సొంత ఊరికి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

బాలయ్య కూడా..
చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి నారావారి పల్లెకు వెళ్లనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన తన భార్య వసుంధరతో కలిసి నారావారి పల్లెకు వెళ్తారని తెలుస్తోంది. నారా-నందమూరి కుటుంబాలు సందడి చేయనున్నాయి. నందమూరి బాలయ్య నటించిన వీర సింహారెడ్డి ఇవ్వాళే విడుదలైంది. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో బాలయ్య అభిమానులు జోష్ లో ఉన్నారు. ఈ నెల 16వ తేదీన చంద్రబాబు, బాలయ్య, లోకేశ్ హైదరాబాద్ కు తిరిగి వెళ్తారు.












Click it and Unblock the Notifications