రఘురామ విషయంలో అమిత్ షాకు చంద్రబాబు కీలక ప్రతిపాదన?
ఏపీలో అసెంబ్లీకి, లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. సమయం కూడా పెద్దగా లేదు. ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. అభ్యర్థులను కూడా ఒకటీ అరా నియోజకవర్గాలు మినహా ప్రకటించేశాయి. నాలుగున్నర సంవత్సరాల నుంచి వైసీపీ రెబల్ ఎంపీగా వ్యవహరించిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఈ ఎన్నికల్లో ఏ పార్టీ తరఫునా టికెట్ దక్కలేదు. నరసాపురం బీజేపీ తరఫున తనకు సీటు ఖాయమనే ధీమాలో ఉన్న ఆయన ఆశలపై ఆ పార్టీ నీళ్లు గుమ్మరించింది.
చంద్రబాబునాయుణ్ని నమ్ముకొని ఉన్నానని రఘురామ ప్రకటించారు. నాలుగున్నర సంవత్సరాలుగా వైఎస్ జగన్ పై పోరాడిన రఘురామ ఈ ఎన్నికల్లో పోటీచేయకపోయినా, పోటీచేసే అవకాశం రాకపోయినా జగన్ దే గెలుపు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో రఘురామకు సీటు కోసం బీజేపీ కీలక నేత అమిత్ షాకి ఒక ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. ఏలూరు లోక్ సభ నియోజకవర్గం బీజేపీకి కేటాయిస్తామని, నరసాపురం నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి వదిలిట్టాలని కోరుతున్నారు. అక్కడి నుంచి తమ పార్టీ తరఫున రఘురామకృష్ణంరాజును బరిలోకి దింపాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారు.

ఏలూరు నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ ఉన్నారు. టీడపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి అల్లుడు అవడంతోపాటు పుట్టా సుధాకర్ యాదవ్ కు కొడుకు అవుతాడు. యనమల కుమార్తె దివ్య కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇలా కేవలం యనమల కుటుంబం నుంచే నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారంటూ విమర్శలు రావడంతో వీటిని తగ్గించేందుకు ఏలూరు ప్రతిపాదనను చంద్రబాబు బీజేపీ ముందు పెట్టారు.
బీజేపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ నరసాపురం నుంచి బరిలోకి దిగారు. ఆ పార్టీ రఘురామకు సీటు కేటాయించివుంటే ఇంత ఇబ్బంది వచ్చివుండేది కాదని చంద్రబాబు భావిస్తున్నారు. బీజేపీతోపాటు టీడీపీతో, జనసేనతో సన్నిహితంగా మెలిగిన రఘురామ లాంటి నేతకు టికెట్ ఇవ్వకపోతే అది జగన్ కు బలంగా మారుతుందని, అలా మారకుండా ఉండాలనే కచ్చితంగా రఘురామను పోటీచేయించాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు. అందుకనుగుణంగా పావులు కదుపుతున్నారు.












Click it and Unblock the Notifications