టీడీపీకి వచ్చే సీట్లు ఇవే: చంద్రబాబు అంచనా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి మధ్య హోరాహోరీగా జరిగిన ఎన్నికల సమరం ముగిసింది. జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. పోటీచేసిన అభ్యర్థులతోపాటు ప్రజలు కూడా అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఒకటోతేదీన జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. వాటినిబట్టి ఏ ప్రభుత్వం వస్తుందనే అంచనాకు రావచ్చు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? అనే విషయాన్ని అంచనా వేశారు.
35 కూడా వచ్చే పరిస్థితి లేదు
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలిస్తే వైసీపీకి కనీసం 35 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి జనసేనాని పవన్ కల్యాణ్ మాటకు కట్టుబడి సహకారం అందించారని, దాదాపుగా మెజారిటీ సీట్లలో జనసేన గెలవబోతోందని పార్టీ నాయకులతో అన్నట్లు తెలిసింది. వైసీపీ ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినా తెలుగుదేశం శ్రేణులు కలిసికట్టుగా ఎదిరించారని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికార పార్టీ అరాచకాలను ధీటుగా ఎదుర్కొన్నారన్నారు. అందుకు మాచర్ల, తాడిపత్రి సంఘటనలను ఉదహరించారు.

కూటమి ప్రభుత్వమే
కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తే వార్ వన్ సైడ్ గానే జరిగిందని, ప్రజలంతా గుంభనంగా వ్యవహరించారని, వారు అలా వ్యవహరించడానికి కూడా కారణం ఉందన్నారు. ఫలానా పార్టీకి ఓటు వేశామని చెబితే ప్రత్యర్థి పార్టీ నుంచి కేసుల గొడవలు, ఇతరత్రా అల్లర్లు జరగడానికి అవకాశం ఉంటుందని భావించి వీరంతా ఓటు ఎవరికి వేశామనే విషయాన్ని బహిరంగపరచడంలేదని విశ్లేషిస్తున్నారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి 120 సీట్లకు పైగా గెలుపొందుతుందని అంచనా వేస్తున్నారు. నాలుగోతేదీన ఫలితాలు వస్తేకానీ వీరి అంచనాలు సరైనవా? కావా? అనేది తేలుతుంది. అప్పటివరకు ఎదురుచూడటమే.












Click it and Unblock the Notifications