రూ.1.80 కోట్ల మోసం.. తమిళ స్టార్ హీరోపై జూబ్లీహిల్స్ పీఎస్ లో కేసు
తమిళ్ స్టార్ హీరో, తెలుగులోనూ వరుడు, సైజ్ జీరో, సైంధవ వంటి సినిమాలలో నటించిన ఆర్య తో పాటు ఆయన నటిస్తున్న ఓ సినిమా యూనిట్ పైన హైదరాబాద్లో చీటింగ్ కేసు నమోదయింది. సినిమా షూటింగ్ ల కోసం అద్దెకు తీసుకున్న కెమెరాలు, లైటింగ్ పరికరాల బకాయిలు ఎగ్గొట్టారు అన్న ఆరోపణల పైన ఈ కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే
కెమెరాలు, లైటింగ్ యూనిట్లు అద్దెకు తీసుకున్న హీరో ఆర్య
హీరో ఆర్య ప్రధాన పాత్రలో అనంతన్ కాడు అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ కోసం హీరో ఆర్య, చిత్ర నిర్మాత వినోద్ కలిసి 2025 ఫిబ్రవరి నెలలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తాహెర్ సినీ టెక్నిక్ అనే ప్రొడక్షన్ పరికరాల అద్దె సంస్థను ఆశ్రయించి కెమెరాలు, లైటింగ్ యూనిట్లు అద్దెకు తీసుకున్నారు. ఈ మేరకు అగ్రిమెంట్ చేసుకున్నారు.

1.80 కోట్లకు పైగా బకాయిలను చెల్లించకుండా ఇబ్బంది
ఒప్పందం మేరకు సదరు సంస్థ వీరికి తమ సొంత ఖర్చులతో భారీ షూటింగ్ డిజిటల్ పరికరాలు అన్నింటిని హైదరాబాద్ నుంచి కేరళలోని షూటింగ్ లొకేషన్ లకు పంపించింది. సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత మొత్తం పరికరాల అద్దె బిల్లు 2.12 కోట్ల రూపాయలు అయింది. అయితే ఇందులో మెజారిటీ వాటా అయిన 1.80 కోట్లకు పైగా బకాయిలను చిత్ర యూనిట్ చెల్లించలేదు.
డబ్బులు ఇవ్వటం లేదని చీటింగ్ కేసు
వారిని ఒకటికి పది సార్లు అడిగి అడిగి విసిగిపోయి చివరకు డబ్బులు ఇవ్వడం లేదని చీటింగ్ కేసు నమోదు చేశారు. అయితే సినిమా విడుదలకు ముందే మొత్తం బకాయిలు క్లియర్ చేసి సంస్థ నుంచి హీరో ఆర్య, నిర్మాత నో డ్యూస్ సర్టిఫికెట్ తీసుకుంటామని, సంతకాలు చేసి లిఖితపూర్వకంగా ఒప్పందాన్ని రాసి ఇచ్చారు. కానీ షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఇప్పటివరకు ఇచ్చిన మాట ప్రకారం డబ్బులు చెల్లించడం లేదు.
డబ్బులు అడిగితే బెదిరించారని ఫిర్యాదు
దీంతో బాకీ డబ్బుల విషయమై సదరు సంస్థ ప్రతినిధులు పలుమార్లు ఫోన్ కాల్స్ వాట్సాప్ మెసేజ్ ల ద్వారా సంప్రదించి చిత్ర యూనిట్ పై ఒత్తిడి తెచ్చిన ఎటువంటి స్పందన లేకపోవడంతో, సంస్థ మేనేజర్ బకాయిల కోసం వారిని గట్టిగా నిలదీశారు. నటుడు ఆర్య, నిర్మాత వినోద్, ఆర్య పిఏ కిషోర్ కలిసి ఆర్య ను బెదిరించినట్టు సంస్థ అకౌంటెంట్ జావేద్ అలీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
వాస్తవాలను కప్పిపుచ్చి కేరళలోని స్థానిక న్యాయస్థానం నుంచి మధ్యంతర ఉత్తర్వులు కూడా తెచ్చుకున్నట్లు బాధితులు తమ ఫిర్యాదుల పేర్కొన్నారు. బాధితులు ఇచ్చిన సమాచారం, ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం హీరో ఆర్య, నిర్మాత వినోద్, ఆర్య పిఏ కిషోర్ ల పైన చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications