అన్నా.. నువ్వు నిద్రపోవడం ఆపన్నా..!?
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోకుండా వైసీపీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా తిమ్మాపురం, నాదెండ్ల మండలాల పరిధిలో ఆయన పర్యటించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పత్తి, మిరప పంటలను పరిశీలించారు. పంటనష్టంపై రైతులను అడిగి చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. గతేడాది తామర పురుగుతో మిర్చి పంట పాడైందని.. ఈసారి పత్తి పంట వేశామని, ఇప్పుడు వర్షాలు దెబ్బతీశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టి పూర్తిగా నష్టపోయామంటూ వాపోయారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ట్ లోని ఉత్తుత్తి బటన్లు నొక్కడం తప్ప రైతుల కష్టాలు పట్టవని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను పట్టించుకోని ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు. అకాల వర్షాలతో పంటలు కుళ్లిపోవడంతో రైతులకు ఆర్థికంగా నష్టం వాటిల్లిందన్నారు. రైతులకు ఇబ్బంది కలిగితే క్షేత్రస్థాయిలో వారికి అండగా ఉండాల్సిన ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని.. ఆయన పొట్ట అబద్ధాల పుట్ట అన్నారు.

అకాల వర్షాలతో పల్నాడు ప్రాంతంలోని పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగివచ్చే పరిస్థితి కనపడటంలేదు. ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని నియోజకవర్గం కావడంతో చంద్రబాబు పర్యటనకు ఒకరోజు ముందే ఆమె ఈ ప్రాంతంలో పర్యటించారు. ఇక్కడి పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించి నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications