ఎవరో చెప్తే చేయలేదు: ముద్రగడకు టిడిపి షాక్, కాపు యువతకు విజ్ఞప్తి, కమిషన్ వైపే..
విశాఖ: కాపు యువకులు ప్రతిపక్షాల ట్రాప్లో పడవద్దని తెలుగుదేశం పార్టీ నేతలు, మంత్రులు ఆదివారం నాడు హితవు పలికారు. ఆదివారం విశాఖలో కేబినెట్ ఉపసంభం భేటీ జరిగింది. భేటీ అనంతరం మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాస రావు, ఎంపీ అవంతి శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడారు.
వారు ముద్రగడ పైన, వైసిపి, కాంగ్రెస్ పార్టీల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. యనమల మాట్లాడుతూ.. ఎవరో చెబితే తాము కాపులను బీసీల్లో చేర్చుతామని చెప్పలేదని ముద్రగడకు కౌంటర్ ఇచ్చారు. తాము ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు.
పాదయాత్ర సమయంలోనే చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. బీసీలకు నష్టం జరగకుండా కాపులకు న్యాయం చేస్తామని చెప్పారు. సమస్యను సానుకూలంగా, సామరస్యంగా పరిష్కరించడమే తమ లక్ష్యమని చెప్పారు. కాపులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
మంత్రి గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ.. కాపులకు రిజర్వేషన్ల పైన తగ్గేది లేదని తెలిపారు. చంద్రబాబు ఇప్పటికే కాపు కార్పోరేషన్ ఏర్పాటు చేశారని, తద్వారా కాపు విషయంలో తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని తెలిపారు. ముద్రగడ దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ... కులానికి, రాజకీయానికి ముడిపెట్టడం సరికాదన్నారు. కాపు యువకులు ప్రతిపక్షాల ట్రాప్లో పడవద్దని హితవు పలికారు. కులాల మాటున రాజకీయాలు తగదని యనమల అన్నారు. రాజకీయ నేతల ఉచ్చులో కుల సంఘాలు పడవద్దని హితవు పలికారు.
కాపులకు తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని, ప్రతిపక్షాల ట్రాప్లో పడి జీవితాన్ని పాడు చేసుకోవద్దన్నారు. చంద్రబాబు పైన ముద్రగడ చేసిన విమర్శలు తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కాగా, ఈ భేటీలో కాపు రిజర్వేషన్ల పైన కమిషన్ ద్వారా ముందుకు వెళ్లాలని ఉపసంఘం నిర్ణయించింది.