కొంచెం తగ్గించాలి: చంద్రబాబుకు రాబిన్ శర్మ కీలక సూచనలు
కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిన నాయకులు సినిమాల్లో కథానాయకుల మాదిరిగా మాస్ డైలాగులు ఉపయోగిస్తారు. ప్రజలను ఆకట్టుకోవాలంటే మాస్ డైలాగుల అవసరాన్ని వారు గుర్తించారు. అయితే రాజకీయాల్లో కుదురుకొని కొంత ఇమేజ్ వచ్చిన తర్వాత ప్రారంభంలో మాట్లాడినట్లుగా మాస్ డైలాగులను ఉపయోగించలేరు. ఎందుకంటే వాటిని వాడటం ఇబ్బందికరంగా ఉంటుందని అందరికీ తెలుసు.

మళ్లీ గెలిచినట్లే అన్న భావనలో..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సభలకు ప్రజలు తండోప తండాలుగా తరలివస్తున్నారు. వారిని చూస్తూ ఆయన మురిసిపోతున్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించినట్లేనని, తన ఉత్తరాంధ్ర పర్యటన కూడా ఇందుకు దోహదపడిందని, ఒకప్పటిక కంచుకోట మళ్లీ తనపార్టీ పరమవుతుందనే ఆశాభావంతో ఉన్నారు. అయితే ప్రసంగాల్లో మార్పు చేయాల్సిన అవసరం ఉందని ఆయనకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న రాబిన్ శర్మ సూచించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

కొంచెం తగ్గించాలి..
రాయలసీమలో తనకు ఇవే చివరి ఎన్నికలనడంతోపాటు మరికొన్ని సభల్లో, సమావేశాల్లో చంద్రబాబు మాటతీరు ప్రజలను, నాయకులను శాసించినట్లుగా ఉంటుందని, 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండటం, అధికారంలో ఉన్నప్పటి హుందాతనం ఉండటంవల్ల అనుకోకుండా మాట అలాగే వస్తుందని, కానీ జాగ్రత్తగా ఉండి మాటతీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపినట్లు వెల్లడించారు. ప్రసంగాల్లో దూకుడు కనిపిస్తోందని, కొంచెం తగ్గించాలని సూచించినట్లు సమాచారం.

సరికొత్త చంద్రబాబును..
అంతే కాకుండా ఇప్పటి తరం రాజకీయ నాయకులు ఎలా మాట్లాడుతున్నారు? టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ ఎలాంటి వ్యూహాలు పన్నుతోంది? వాటిని తిప్పి కొట్టడానికి అనుసరించాల్సి వ్యూహాలు? నియోజకవర్గాల్లో నాయకులు అధికార పార్టీపై ఏ తరహా పోరాటానికి సిద్ధం కావాలి? .. తదతర విషయాలపై పలు సూచనలు చేసినట్లు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ముందుగా ఆ మార్పులు చంద్రబాబు నుంచే ప్రారంభం కావాలనే ఉద్దేశంతో ఇంప్లిమెంట్ చేయని చెప్పారు. ఉత్తరాంధ్ర పర్యటన ముగియడంతో చంద్రబాబు తర్వాత సభలు, సమావేశాల్లో సరికొత్త చంద్రబాబును చూడబోతున్నట్లు అర్థమవుతోంది. ఏ విధమైన చంద్రబాబును చూడాల్సి ఉంటుందా? అని తెలుగు తమ్ముళ్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications