టీడీపీ-జనసేన కమిటీ తొలి భేటీ-పవన్, లోకేష్ సహా సభ్యుల కీలక చర్చలు..!
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాడేందుకు ఏర్పాటైన టీడీపీ-జనసేన ఉమ్మడి సమన్వయ కమిటీ ఇవాళ రాజమండ్రిలో భేటీ అయింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు హోటల్లో జరుగుతున్న ఈ భేటీకి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు కమిటీలోని ఇతర సభ్యులు కూడా హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనే విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలు, చంద్రబాబు అరెస్టు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై కమిటీ చర్చిస్తోంది.

ఏపీ స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాజమండ్రి జైలుకు వెళ్లి ఆయన్ను పరామర్శించిన తర్వాత టీడీపీ-జనసేన పొత్తుపై ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్.. ఇవాళ తొలిసారి ఉమ్మడి కమిటీ భేటీకి హాజరయ్యారు. ఇవాళ్టి భేటీకి హాజరైన సందర్భంగా నారా లోకేష్ ఆయనకు టీడీపీ సభ్యుల్ని పరిచయం చేశారు. అలాగే నారా లోకేష్ కూడా స్వయంగా వెళ్లి జనసేన తరఫున కమిటీలో ఉన్న సభ్యుల్ని పరిచయం చేసుకున్నారు.

అనంతరం ఇరుపక్షాలు చర్చలు ప్రారంభించాయి. ఇవాళ్టి భేటీలో జనసేన, టీడీపీ ఇరు పార్టీలూ వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి తమవైపు నుంచి ప్రతిపాదనల్ని పరస్పరం పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేనకు టీడీపీ ఈసారి తక్కువ సీట్లు ఆఫర్ చేస్తోందని, జనసేనను అస్సలు పట్టించుకోవడం లేదని వైసీపీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ జనసేన తరఫున ఇచ్చిన ప్రతిపాదనలు వీరి పొత్తుకు కీలకంగా మారనున్నాయి.

అలాగే టీడీపీ వైపు నుంచి కూడా జనసేనకు పలు ప్రతిపాదనలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎవరికి బలం ఉన్న చోట వారు పోటీ చేసే విధంగా, ఇరు పార్టీల సమన్వయ కమిటీలను క్షేత్రస్ధాయి వరకూ ఏర్పాటు చేసుకునేలా పలు ప్రతిపానదలు చేసే అవకాశముంది. ఇవాళ ఉదయం జైల్లో చంద్రబాబును ములాఖత్ లో కలిసిన నారా లోకేష్ ఈ భేటీలో చర్చించే అంశాలపై సూచనలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications