రాజధాని టెన్షన్.. : దేవినేని ఉమా అరెస్ట్.. గొల్లపూడిలో ఉద్రిక్తత
ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని డిమాండ్ చేస్తూ అక్కడి రైతులు చేస్తున్న ఆందోళనలు పదో రోజుకు చేరుకున్నాయి. రాజధానిపై నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ ఉండటంతో అమరావతి ప్రాంతంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే క్రమంలో టీడీపీ నేత దేవినేని ఉమా గొల్లపూడి నుంచి విజయవాడ దుర్గగుడి వరకు భారీ ర్యాలీకి సిద్దమయ్యారు.
భారీగా తరలివచ్చిన రైతులతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దేవినేనిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు,రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. పోలీసుల చర్యను నిరసిస్తూ రైతులు,స్థానిక గ్రామాల ప్రజలు తమ నిరసనను కొనసాగిస్తున్నారు.

కాగా,ఏపీ కేబినెట్ భేటీలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్గా విశాఖకు ఆమోద ముద్ర పడటం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. అమరావతి ప్రాంత రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అక్కడ భారీగా బలగాలను మోహరించారు.
దీంతో ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో రైతుల పోరాటాన్ని అణచివేయాలని చూస్తోందని టీడీపీ విమర్శిస్తోంది. స్థానిక రైతులతో కలిసి టీడీపీ నేతలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రకటన విరమించుకునేంత వరకు ఆందోళనలు ఆపేది లేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications