పోలీసుల దాడులు: జాతీయ మహిళా కమిషన్కు టీడీపీ ఫిర్యాదు
గుంటూరు: అమరావతి రాజధాని కోసం రైతులు, ప్రజలు భారీ ఎత్తున పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. రైతుల, మహిళలు చేస్తున్న ఆందోళనలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అంతేగాక, పలుమార్లు వారిపై లాఠీఛార్జీ కూడా చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఆదివారం ఉదయం కేంద్ర మహిళా కమిషన్ బృందం సభ్యులను కలిశారు.
గుంటూరులోని ఆర్అండ్బీ అతిథి గృహంలో మహిళా కమిషన్ సభ్యులను కలిసిన టీడీపీ నేతలు రాజధాని ప్రాంతంలో మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భేటీ అనంతరం టీడీపీ నేతలు ఎంపీ గల్లా జయదేవ్, పంచమర్తి అనురాధ, జేఏసీ నేతలు మాట్లాడుతూ.. గత 26 రోజులుగా పోలీసులు మహిళలపై దాడులు చేస్తున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని కమిషన్ సభ్యులకు వివరించినట్లు చెప్పారు.

అమరావతి ఘటనలపై ఏపీ మహిళా కమిషన్ స్పందించకపోవడంతో.. ఢిల్లీ నుంచి కేంద్ర మహిళా కమిషన్ స్పందించి అమరావతికి రావడం మంచి విషయమని అన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కమిషన్ సభ్యులకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
అమరావతిలో మహిళా కమిషన్
రాజధాని అమరావతిలో మహిళలపై జరుగుతున్న దాడులను సుమోటోగా తీసుకున్న నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ నుంచి ఇద్దరు సభ్యుల బృందం అమరావతిలో పర్యటిస్తోంది. ఆదివారం ఉదయం వీరు గుంటూరు చేరుకున్నారు. రాజధాని ప్రాంతంలో ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసుల దాడులు, తోపులాటలపై ఆరోపణలు వెల్లువెత్తడంతో.. కమిషన్ ఈ అంశాన్ని సుమోటోగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇది ఇలావుండగా, రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 26 రోజులుగా రైతులు, మహిళలు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అమరావతి రాజధానిని తరలించొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అయితే, నిరసనలు, ఆందోళనల్లో పాల్గొంటున్న రైతులు, మహిళలపై పోలీసులు పలుమార్లు లాఠీఛార్జీ చేయడం విమర్శలకు తావిచ్చింది. పోలీసులు లాఠీఛార్జీలు చేయడంతో పలువురు రైతులు, మహిళలు గాయపడ్డారు. ఓ మహిళ చేయి విరిగింది. దీంతో రైతులు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై ఎందుకు దాడి చేస్తున్నారని మండిపడుతుననారు. ఇంత జరుగుతున్న ఒక్క మాట కూడా మాట్లాడటం లేదంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications