మిగిలింది విజ్ఞత, పిల్లాడిలా: జగన్ ఏమన్నారు, టిడిపి కౌంటర్ ఏమిటి?
గుంటూరు: రాజధాని అమరావతి శంకుస్థాపనకు తనను పిలువవద్దని, పిలిచినా రానని చెప్పిన ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రులు, అధికార పార్టీ నేతలు తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నారు. తనను ఆహ్వానించవద్దని జగన్ గురువారం మధ్యాహ్నం సిఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు.
దీనిపై టిడిపి నేతలు మూకుమ్మడి దాడి చేశారు. తాను అమరావతి శంకుస్థాపనకు ఎందుకు రావడం లేదో చెప్పిన జగన్కు కౌంటర్ ఇచ్చారు. పనిలో పనిగా దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పేరును ప్రస్తావించారు.
బలవంతంగా లాక్కున్నారన్న వ్యాఖ్యలకు కౌంటర్
బలవంతంగా భూములు లాక్కుంటున్నారన్న జగన్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే పేదల భూములు పరిశ్రమల పేరుతో లాక్కున్నారని ధ్వజమెత్తారు. జగన్ కుటుంబం నివసించేందుకు ఐదెకరాల లోటస్ పాండ్ కావాలని, అదే 5 కోట్ల ఏపీ ప్రజలకు 33వేల ఎకరాలు అవసరం లేదా అని నిలదీశారు.
రాజధాని ప్రాంతంలో సెక్షన్ 144 అమలుపై..
రాజధాని ప్రాంతంలోని రైతులు అందరూ స్వచ్చంధంగా భూములు ఇచ్చారని మంత్రులు స్పష్టం చేశారు. అయితే, విఐపీలు, వివిఐపీలు వస్తున్నందున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. అసలు జగన్కు 144 సెక్షన్ గురించి తెలుసా అని నిలదీశారు.
గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పు బేఖాతరు...
రాజధాని అమరావతి శంకుస్థాపనకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు వచ్చాయని టిడిపి నేతలు చెప్పారు. ఇందుకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి పత్రం జారీ చేసిందని వివరించారు.

తెలంగాణ నేతలు వస్తామంటే..
విభజన జరిగినప్పటికీ తెలంగాణ రాష్ట్ర మంత్రులు బాగా స్పందించారన్నారు. కానీ రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నేత తీరు మాత్రం సరిగాలేదని దుయ్యబట్టారు. అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానిస్తే తాము వెళ్తామని తెలంగాణ మంత్రి కెటిఆర్ చెప్పారని, కానీ జగన్ మాత్రం తాను రానని చెప్పడం ఏమిటన్నారు.
వందల కోట్ల ఖర్చుపై..
రాజధాని అమరావతి శంకుస్థాపనకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణ పైన మంత్రులు స్పందించారు. ఇప్పటి వరకు రూ.9 కోట్లు విడుదలయిందని చెప్పారు. ఖర్చుకు స్పాన్సర్లు ముందుకు వచ్చారన్నారు. అదే సమయంలో పలువురు ప్రముఖులు సొంత ఖర్చుతో వస్తున్నారని తెలిపారు.
అత్తగారి సొత్తులా..
అత్తగారి సొత్తులా ఇష్టం వచ్చినట్లు ఆక్రమించుకునే మీ మనస్తత్వానికి నేను శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావడం లేదని జగన్ చెప్పారు. దీనికి కూడా మంత్రులు కౌంటర్ ఇచ్చారు. రైతులు స్వచ్చంధంగానే భూములు ఇచ్చారని చెప్పారు. తాను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పి జగన్ తన మిత్రులతో మూడు వేల ఎకరాల భూమి కొనుగోలు చేయించారని టిడిపి నేతలు ఆరోపించారు.
ల్యాండ్ అసైన్మెంట్ యాక్ట్ ద్వారా వైయస్ రెండు లక్షల ఎకరాలు ప్రజల నుంచి లాక్కున్నారని ఆరోపించారు. బ్రాహ్మణి, లేపాక్షి భూములను బ్యాంకుల్లో పెట్టి లక్షలు దండుకున్నారన్నారు.
తనను ఆహ్వానించవద్దని చెప్పడం జగన్ అపరిపక్వతకు నిదర్శనమని, శుభకార్యానికి రానని చెప్పేవాడిని జగన్ను మాత్రమే చూస్తున్నానని, ప్రతిపక్ష నేతగా కూడా అనర్హుడని, ఆయనకు ఎలా అర్హత ఉంటుందని ప్రశ్నించారు.
మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పి నారాయణ, దేవినేని ఉమామహేశ్వర రావు, టిడిపి ఎమ్మెల్సి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర తదితరులు జగన్ పైన దుమ్మెత్తి పోశారు. చివరగా.. జగన్ చెప్పినప్పటికీ తాము ఆహ్వానిస్తామని, కానీ రావడం, రాకపోవడం ఆయన విజ్ఞతకు వదిలేస్తామని మంత్రి పత్తిపాటి చెప్పారు. మరో మంత్రి యనమల మాట్లాడుతూ.. ఆయన పిలువొద్దని కోరుకుంటే పిలవమన్నారు.












Click it and Unblock the Notifications