'మాల్యా నివాసంలో జగన్ కూతుళ్లు.. నిజం కాదా? లీక్ కావడంతో జగన్ కొత్త ఎత్తుగడ!'
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాతో సంబంధాలు ఉన్నాయని వైసీపీ నేత విజయ సాయి రెడ్డి ఆరోపించడం దారుణం అన్నారు.
కుల పార్టీ, జనసేన పంథా, 2014 పోటీ.. వీటన్నింటికి పవన్ దిమ్మతిరిగే సమాధానాలు!
అసలు, జగన్ తన కూతుళ్లను లండన్లో ఉంటున్న విజయ్ మాల్యా నివాసంలో ఉంచి చదివిస్తోంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గాలి జనార్దన్ రెడ్డికి మద్దతుగా విజయ సాయిరె రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దివంగత ఎన్టీఆర్ పేరుతో జగన్ రాజకీయం చేస్తున్నారన్నారు.
4 రోజుల ముందే ఎన్టీఆర్ పేరు పెట్టాలని నిర్ణయించాం
ఏపీలో జిల్లాల విభజన తర్వాత నిమ్మకూరు ఉండే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని టీడీపీ గతంలోనే నిర్ణయించిందని బుద్ధా వెంకన్న అన్నారు. తిరుపతి సభకు నాలుగు రోజుల ముందు కృష్ణా జిల్లా టీడీపీ నేతల్ని చంద్రబాబు పిలిపించారని, జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టే విషయంపై అభిప్రాయాన్ని అడిగారని, దానికి అందరం సంతోషంగా అంగీకరించామన్నారు.
లీక్ కావడంతో జగన్ రాజకీయం
చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారనే విషయం లీక్ కావడంతో జగన్ రాజకీయం చేస్తున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఎన్టీఆర్ ఎంతో కష్టపడి సంపాదించుకున్న రామకృష్ణ స్టూడియోను రాజీవ్ గాంధీ హత్యానంతరం వైయస్ రాజశేఖర రెడ్డి అల్లర్లలో ధ్వంసం చేయించింది వాస్తవం కాదా? చెప్పాలని జగన్ను అడిగారు. దీనిపై జగన్ క్షమాపణ చెప్పాలన్నారు.
నందమూరి కుటుంబంతో టీడీపీ నేతలు
జగన్ రాజకీయంగా లబ్ధి పొందేందుకే ఎన్టీఆర్ పేరును తెరపైకి తీసుకు వచ్చారని టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, పామర్రు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. వారు నందమూరి కుటుంబంతో కలిసి మీడియాతో మాట్లాడారు. నాడు రాజమండ్రిలో రెండు వంతెనల మధ్య ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడుతుంటే వైయస్ అడ్డుకున్నారన్నారు.
ఎన్నికల్లో ఓడిపోతామని జగన్ కొత్త ఎత్తుగడ
టీడీపీ నేతలు అందరూ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ప్రతిపాదిస్తే వైయస్ రాజీవ్ పేరు పెట్టారని టిడిపి నేతలు అన్నారు. అనేసార్లు కాంగ్రెస్, వైయస్ ఎన్టీఆర్ను అవమానించారన్నారు. జగన్ ప్రకటను ప్రజలు ఎవరూ నమ్మడం లేదన్నారు. గతంలోను ఎన్టీఆర్ పేరుతో లబ్ధి పొందారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే జగన్ ఎన్టీఆర్ పేరుతో కొత్త ఎత్తుగడ వేశారన్నారు.
వైసీపీ నేతల మాట విని నిమ్మకూరులో జగన్ అబద్దాలు
కొందరు వైసీపీ నేతల మాటలు విని నిమ్మకూరులో జగన్ అబద్దాలు చెప్పారని టీడీపీ నేతలు మండిపడ్డారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని గతంలోనే టీడీపీ తీర్మానం చేసిందని చెప్పారు. కేంద్రం జిల్లాలను విభజించి నియోజకవర్గాలను పెంచాలని భావించిందని, అప్పుడే ఎన్టీఆర్ పేరు పెట్టాలని టీడీపీ నిర్ణయించిందన్నారు.