జగన్ ప్రభుత్వం చేతికి టీడీపీ కొత్త అస్త్రాలు - చంద్రబాబు చిక్కుతారా..!?
ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ టీడీపీని కొత్త కష్టాలు వెంటాడుతున్నాయి. వైసీపీకి అవే అస్త్రాలుగా మారుతున్నాయి. వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో వైసీపీ సెంటిమెంట్ రాజకీయాన్ని తెర మీదకు తెస్తోంది. భారీ జనసందోహం చంద్రబాబు సభల్లో కనిపిస్తున్న వేళ.. వరుస పరిణామాలు ఆత్మరక్షణలోకి నెడుతున్నాయి. చంద్రబాబు ప్రచారం కోసమే ఈ రకంగా జరుగుతోందంటూ సీఎం జగన్ మొదలు పార్టీ నేతల వరకు ఆరోపణలు చేస్తున్నారు. సభలకు అనుమతి ఇవ్వద్దంటూ డిమాండ్లు మొదలయ్యాయి. టీడీపీ కార్యక్రమాల్లో సామాన్య ప్రజల ప్రాణాలు పోతున్నవేళ..కఠిన చర్యల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీంతో..రానున్న రోజుల్లో చంద్రబాబు సభల విషయంలో టీడీపీ ఏం చేయబోతుందనేది ఆసక్తిగా మారుతోంది.

కందుకూరు..గుంటూరు వరుస ఘటనలతో
చంద్రబాబు కొంత కాలంగా వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. సభలు నిర్వహిస్తున్నారు. భారీగా జన స్పందన కనిపిస్తోంది. కందుకూరులో జరిగిన సభ సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. అందులో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో చంద్రబాబు తన ప్రచారం కోసం వారి ప్రాణాలు పోవటానికి కారణమయ్యారంటూ వైసీపీ ఆరోపించింది. టీడీపీ అధినేత దీనిని ఖండించారు. ఇరుకు సందుల్లో భారీ జనం ఉన్నట్లుగా డ్రోన్ షాట్స్ కోసం చేసిన ప్రయత్నాల్లో ఈ ప్రమాదం జరిగిందని వైసీపీ నేతలు విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ సైతం చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని ప్రచారం కోసం 8 మంది ప్రాణాలు తీసారంటూ ఆరోపించారు. ఆ ఘటన నుంచి కోలుకోక ముందే ఇప్పుడు గుంటూరులో జరిగిన మరో తొక్కిసలాట టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టేసింది.

పోలీసు కేసులు.. అనుమతులు ఇవ్వద్దంటూ
ఈ రెండు ఘటనల పైన పోలీసులు కేసు నమోదు చేసారు. ఇప్పుడు మంత్రులు..వైసీపీ నేతలు ఈ ఘటనలతో చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వద్దని తాజా - మాజీ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు తమ ప్రాంతానికి మాత్రం రావద్దంటూ కడప జిల్లా పొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రడ్డి చెప్పుకొచ్చారు. ఇంత మంది మరణాలకు కారణమైన చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వద్దంటూ మాజీ మంత్రి కొడాలి నాని..తాజా మంత్రి జోగి రమేష్ డిమాండ్ చేసారు. అటు గుంటూరులో జరిగిన ఘటనలో మరణించిన ముగ్గురు ..గాయపడిన వారు మహిళలు కావటంతో మహిళా కమిషన్ విచారణ ప్రారంభించింది. వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలు టీడీపీకి సమస్యగా మారుతున్నాయి.

ప్రభుత్వం ఏం చేయబోతోంది...
ఇప్పుడు ప్రభుత్వం ఈ వరుస ఘటనలపైన నివేదిక కోరినట్లు సమాచారం. కందుకూరులో ఇరుకు సందులో సభ ఏర్పాటు చేయటం..జనం రద్దీ ఎక్కువగా ఉందని చూపించే క్రమంలోనే ప్రమాదం జరిగిందని అధికార పార్టీ ఆరోపిస్తోంది. డిమాండ్ చేస్తున్నట్లుగా చంద్రబాబు సభలకు అనుమతి పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉండదని.. నియంత్రణ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నుంచి సభ నిర్వహణ పైన నియంత్రణకు నిర్ణయిస్తే ప్రశ్నించే అవకాశం కూడా లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, దీని పైన ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఉత్కంఠ పెంచుతోంది. టీడీపీ అధినేతను మీటింగ్ కు ఆహ్వానించి.. సరిగ్గా ఏర్పాట్లు చేయకపోవటం పైన పార్టీ ముఖ్య నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications