అనంతపురంలో బాలకృష్ణ: చూసేందుకు పెద్ద సంఖ్యలో ఎగబడ్డ జనం
అమరావతి: సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం అనంతపురం జిల్లా పట్టణానికి వచ్చారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా గౌస్మోహినుద్దీన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నిమ్మల కిష్టప్ప, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, బీకే పార్ధసారధి, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.
బాలకృష్ణ అనంతపురం పట్టణానికి వచ్చారని తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు అక్కడికి పెద్ద సంఖ్యలో ఆయన్ని చూసేందుకు అక్కడికి చేరుకున్నారు.
కేశవదాసుపాలెం వద్ద చమురు లీకేజీ
తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో పైప్లైను నుంచి చమురు లీకేజీ అవుతూనే ఉంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం రాత్రి చమురు లీక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమాచారం అందుకున్న ఓఎన్జీసీ సిబ్బంది ఘటనాస్థలిని పరిశీలించి బుధవారం తాత్కాలిక మరమ్మతులు చేశారు. అయినా సరే చమురు లీకేజీ ఆగకపోవడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
ఆర్టీసీ బస్సు బోల్తా: 20 మందికి గాయాలు
విశాఖపట్నం జిల్లా యలమంచిలి మండలం పెద్దపల్లి జాతయరహదారిపై బుధవారం మధ్యాహ్నాం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన యలమంచిలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించారు. అమలాపురం నుంచి టెక్కలి వెళుతున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.