చెల్లెల్నేగౌరవించడు: జగన్పై చింతమనేని, రోజాను అలాగేనా: అనిత
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మంగళవారం నాడు అసెంబ్లీలో తీవ్రంగా మండిపడ్డారు. జగన్కు కనీసం చెల్లెలిని గౌరవించడం కూడా తెలియదన్నారు.
తనపై జగన్ అసత్యాలు చెబుతున్నారని చింతమనేని ప్రభాకర్ అన్నారు. జగన్ పదకొండు కేసుల్లో, దేశద్రోహంలో ముద్దాయి అన్నారు. వనజాక్షి పైన తాను దాడి చేశానని చెప్పింది అవాస్తవమన్నారు. ఆమె కూడా తన పైన ఫిర్యాదు చేయలేదన్నారు.
ఈయన ఎమ్మెల్యే రోజా గురించి చెప్పడం విడ్డూరమన్నారు. జగన్కు కనీసం తన చెల్లెలినే గౌరవించడం తెలియదన్నారు. వనజాక్షి పైన దాడి చేయలేదని చెప్పారు. డ్వాక్రా సంఘాలు, వనజాక్షి గొడవను తనకు ఆపాదిస్తున్నారన్నారు.
తహసీల్దారు వ్యవహారంలో జగన్ అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. జగన్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. అంతకుముందు జగన్.. వనజక్షి ఘటనను సభలో ప్రస్తావించారు. వనజాక్షి జుత్తు పట్టుకున్న దుశ్సాసనుడు ఇక్కడే ఉన్నాడని జగన్ అన్నారు.
జగన్ నీకు నేను చెల్లెలిలా కాదా: అనిత ప్రశ్న
నీకు రోజా మాటలు కనిపించలేదా, అలాంటి చెల్లెలిని నేను కాదా అని జగన్ను టిడిపి ఎమ్మెల్యే అనిత ప్రశ్నించారు. రోజా ఏం అన్నారో నీకు తెలియదా అన్నారు. మహిళల గురించి మాట్లాడుకునే ఇలాంటి మంచి సందర్భంలో అలాంటి మనిషి (రోజా) గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు.
నేను నీకు అక్కా చెల్లిలా కాదా అన్నారు. ఓ చెల్లిగా నేను జగన్ను, సభను అడుగుతున్నానని, రోజా తన పైన చేసిన వ్యాఖ్యలకు న్యాయం చేయాలన్నారు. టిడిపి హయాంలోనే మహిళలకు న్యాయం జరుగుతుందన్నారు. మహిళలను వేధించిన వారిపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు.
ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసిన రోజాను జగన్ వెనుకేసుకు రావడం విడ్డూరమన్నారు. మీరు నాయకుడు అని, రోజా చేసిన వ్యాఖ్యలకు ఆమెతో తనకు క్షమాపణలు చెప్పించాలన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో రోజా... అనిత పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.