నారా లోకేష్ చుట్టూ వలయం: వెంట్రుక కూడా పీకలేరు: కొడాలి నానికి కడప టీడీపీ నేత సవాల్
కడప: కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో చోటు చేసుకున్న జంట హత్యల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన ఘాటు వ్యాఖ్యలకు సంబంధించిన ప్రకంపనలు సద్దు మణగట్లేదు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నారు. పరస్పరం సవాళ్లు విసురుకుంటోన్నారు.
శాసన మండలిలో బలం ఉన్నా.. లేకున్నా..
పాణ్యం పర్యటన సందర్భంగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తప్పు పట్టిన విషయం తెలిసిందే. శాసనమండలిలో క్రమంగా తమ బలం పెరుగుతోందని, అక్కడ నారా లోకేష్ను ఆడుకుంటామంటూ కొడాలి నాని చేసిన ప్రకటనను కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ బీటెక్ రవి తప్పు పట్టారు. శాసన మండలిలో ఇంకా తమ బలం ఉందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తనలాంటి వాళ్లు 14 మంది ఉన్నారని, నారా లోకేష్కు వలయంగా ఉంటామని అన్నారు.
మా భాష బాగుంటుంది..
ఈ ఉదయం ఆయన కడప జిల్లాలోని జమ్మలమడుగులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ నాయకుల భాష ఏనాడూ హద్దులు దాటదని, పరిమితంగా మాట్లాడుతారని బీటెక్ రవి అన్నారు. తమ భాష చాలా బాగుంటుందని చెప్పారు. ఆగ్రహావేశాలకు లోనైనప్పుడు నోరు జారడం సహజమేనని చెప్పారు. నారా లోకేష్ పాణ్యం నియోజకవర్గం పర్యటన సందర్భంగా కూడా ఇదే జరిగిందని వ్యాఖ్యానించారు. దాన్ని తప్పు పట్టడం సహేతుకం కాదని బీటెక్ రవి అన్నారు.
ఆవేశంలో అని ఉండొచ్చు..
జంట హత్యలు చోటు చేసుకున్న చోట సహజంగానే ఉద్రిక్తత ఉంటుందని, ఆ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నారా లోకేష్ ఏరా అంటూ సంబోధించి ఉండొచ్చని బీటెక్ రవి అన్నారు. అంతమాత్రాన పార్టీ నాయకులందరి భాషను తప్పు పట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. వైఎస్ జగన్ను ఏకవచనంతో ఒక్కసారి సంబోధించగానే.. ఆయనను తప్పు పడుతూ కొడాలి నాని మాట్లాడిన పద్ధతి, తీరు బాగా లేదని అన్నారు. శాసన మండలిలో నారా లోకేష్ అంతు చూస్తామని హెచ్చరించడం సరికాదని చెప్పారు.
వెంట్రుక కూడా పీకలేరు..
శాసన మండలిలో తనలాంటి సభ్యులు ఇంకా 14 మంది ఉన్నారని గుర్తు చేశారు. తాము ఉండగా కొడాలి నాని గానీ ఇంకెవరైనా అధికార పార్టీ నేతలు గానీ నారా లోకేష్ వెంట్రుక కూడా పీకలేరని చెప్పారు. నారా లోకేష్ నాయకత్వంలో తాము ఇంకా ఉత్సాహంగా పని చేస్తామని అన్నారు. చంద్రబాబు, నారా లోకేష్ను తిట్టడానికే కొడాలి నానికి వైఎస్ జగన్ మంత్రి పదవి ఇచ్చారని ధ్వజమెత్తారు. రెండేళ్ల తరువాత కొడాలి నానికి మంత్రి పదవి ఉంటుందో.. ఊడుతుందో కూడా తెలియదని ఎద్దేవా చేశారు.